ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. డిసెంబర్ 04న ప్రీమియర్స్ షోలు నిర్వహించారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సంధ్య థియేటర్ లో కూడా ప్రీమియర్ షోస్ నిర్వహించారు. సాధారణంగా ఈ థియేటర్ కి సినీ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు భారీగా వస్తుంటారు. అలాంటిది అల్లు అర్జున్ కూడా వస్తున్నాడని తెలియడంతో సంధ్య థియేటర్ వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు.

వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఝులిపించారు. అయినప్పటికీ తొక్కిసలాట జరిగింది. దీంతో పుష్ప2 సినిమా వీక్షించడానికి వచ్చిన రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడిపోయారు. పోలీసులు వారిని గమనించి సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. రేవతి చికిత్స పొందుతూ మరణించింది. తాజాగా ఈ ఘటన పై అల్లు అర్జున్ స్పందించారు. మృతురాలు కుటుంబానికి అననని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. రేవతి మరణ వార్తతో పుష్ప2 సెలబ్రేషన్స్ కూడా నిర్వహించుకోలేకపోయాం. గత 20 ఏళ్లుగా నేను ఆ థియేటర్ కు వెళ్తున్నాను. మొన్న సినిమా చూస్తుండగా మా మేనేజర్ వచ్చి బయట గందరగోళంగా ఉంది.. వెళ్లిపోమని చెప్పారు. ఆ తరువాత రోజు ఈ ఘటన గురించి తెలిసింది. ఆ షాక్ లో వెంటనే స్పందించలేకపోయాను. ఆమె కుటుంబానికి సారి చెబుతున్నా.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు అల్లు అర్జున్.