నటుడు పృథ్వీపై వరకట్న వేధింపుల కేసు కొట్టివేత

-

టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్‌పై నమోదైన వరకట్న వేధింపుల కేసును కొట్టివేస్తూ విజయవాడ కోర్టు తీర్పు వెలువరించింది. అదనపు కట్నం కోసం తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని పృథ్వీ భార్య శ్రీలక్ష్మి ఫిర్యాదుపై నగరంలోని సూర్యారావుపేట స్టేషన్‌లో 2016లో సెక్షన్‌ 498ఏ కింద వరకట్న వేధింపుల కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. 2017లో నగరంలోని రెండో ఏసీఎంఎం (అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌)లో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. దీనిపై అప్పటి నుంచి వాదనలు జరుగుతున్నాయి.

వివాహం సందర్భంగా డబ్బు, బంగారు నగలు ఇచ్చినా.. ఇంకా అదనపు కట్నం తీసుకురావాలని నిత్యం వేధించేవారని శ్రీలక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమాల్లో నటించేందుకు హైదరాబాద్‌ వెళ్లిన తర్వాత, వ్యసనాలకు బానిసై తనను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా కేసుపై తుది తీర్పును న్యాయాధికారి మాధవీదేవి వెలువరించారు. విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టేస్తూ న్యాయాధికారి తీర్పు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news