ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో.. అభిమానులకు మెగాస్టార్ సందేశమిదే..?

-

ఒడిశా బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ ఘటనలో 278 మంది మరణించారు. మరో 900 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలిలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మహా విషాదంపై రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు పరిహారం ప్రకటించాయి.

తాజాగా ఒడిశా రైలుపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. స్పందించడమే కాదు ఈ ఘటన నేపథ్యంలో తన అభిమానులకు, యావత్ తెలుగు సినీ ప్రేక్షకులకు ఓ సందేశం పంపించారు. ఇలాంటి ఆపద సమయంలో రక్తదానం చేసేందుకు అభిమానులంతా ముందుకు రావాలని కోరారు. ఆస్పత్రుల వద్ద అభిమానులు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు.

“రైలు ప్రమాదంలో పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాల రోదనలు వింటుంటే నా హృదయం ఎంతో బరువెక్కిపోయింది. ఈ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తం అవసరమని అర్థమవుతుంది. రక్తదానం చేసేందుకు సమీప ఆస్పత్రుల వద్ద అభిమానులు అందుబాటులో ఉండాలని నా విజ్ఞప్తి.” అని చిరంజీవి అన్నారు.

మరోవైపు ఈ ప్రమాదంపై సినీనటుడు ఎన్టీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో వారు ధైర్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news