నేడు నటుడు నవదీప్‌ను ప్రశ్నించనున్న నార్కోటిక్ పోలీసులు

-

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి.. టాలీవుడ్​ను మరోసారి షేక్ చేసిన హైదరాబాద్​లోని మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులను విచారిస్తున్న పోలీసులు వారి మొబైల్ ఫోన్ డేటాను పరిశీలించి వారితో సంబంధం ఉన్న వారిని పట్టుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే నటుడు నవదీప్​కు ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌ను ఇవాళ నార్కోటిక్ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఉదయం 11 గంటలకు పోలీసుల ముందు హాజరుకావాలని నవదీప్‌కు నోటీసుల్లో పేర్కొన్నారు. నవదీప్ విచారణలో.. డ్రగ్స్ విక్రేత రామచందర్‌తో ఆయనకు ఉన్న లింకులపై పోలీసులు ఆరా తీయనున్నారు. ఎవరివద్ద డ్రగ్స్ కొంటున్నారనే విషయం తెలుసుకోనున్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌ను వినియోగదారుడిగా చేర్చిన విషయం తెలిసిందే.

మరోవైపు నార్కోటిక్‌, గుడిమల్కాపూర్‌.. పోలీసుల సంయుక్త దాడిలో అరెస్టైన బాలాజీ,  సినీ ఫైనాన్షియర్‌ వెంకటరత్నారెడ్డి విచారణలో సినీ ప్రముఖులతో ఉన్న పరిచయాల గురించిన కీలక విషయాలు వెల్లడించారు. విశాఖకు చెందిన రామ్‌చందర్‌ కేసులో కీలకంగా వ్యవహరించాడని పోలీసులు గుర్తించారు. రాంచందర్‌తో ఉన్న పరిచయంతో నటుడు నవదీప్‌ డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు ఆధారాలు సేకరించారు. రాంచందర్‌, నవదీప్‌ మధ్య వాట్సప్‌ సంభాషణలు తదితర విషయాలపై పోలీసులు ఆధారాలు సేకరించారు. నేడు నవదీప్‌ను ప్రశ్నించడం ద్వారా..మత్తపదార్ధాల కేసులో కీలకవిషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version