పవిత్ర నగరం…అయోధ్య విశేషాలు ఇవే !!

-

అయోధ్య.. అంటే చాలు అందరిలో ఒక భక్తి భావన. దేశంలో ప్రతి హిందు హృదయం పులకించే పేరు. సద్గుణ రాముడి జన్మస్థానం. ఆ ఆయోధ్య మోక్ష నగరాలలో ఒకటి. పరమపవిత్రమైనది. ఆగస్టు 5న రామజన్మభూమికి శంకుస్థాపన నేపథ్యంలో ఆ నగర విశేషాలు ఒకసారి తెలుసుకుందాం..

ఓ చారిత్రక, పౌరాణిక నగరం. ఎందరెందరో రాజులు, మహనీయుల పాదస్పర్శతో పునీతమైన పుణ్యప్రదేశం. సాక్షాత్తు విష్ణు భగవానుని అవతారంగా చెప్పబడ్తున్న శ్రీరామచంద్రుని పుట్టిన స్థలంగా దీనిని హిందువులు విశ్వసిస్తారు. ఇక్కడి నేల పవిత్రం… గాలి పవిత్రం… పరిసరాలు పవిత్రం… అందుకే అయోధ్యను సప్తమోక్ష పురాలలో ఒకటిగా మన పురాణాలు చెప్పాయి.


ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫైజాబాద్కు ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న అయోధ్య విస్తీర్ణంలో చిన్నదైనప్పటికీ,మహిమరీత్యా ప్రఖ్యాతి చెందిన నగరం. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, స్వామినారాయణుడు, ఎందరెందరో మహనీయులకు జన్మనిచ్చిన అయోధ్య పూర్వనామం ‘సాకేత’. కోసల దేశ రాజధానిగా ప్రసిద్ధిగాంచిన ఈ నగరం ఎందరెందరో ఇక్ష్వాకు రాజులకు పుట్టిల్లుగా వెలిసింది. ఇక్ష్వాకు మహారాజు కుమారుడైన వైవస్వతమను అయోధ్యను అభివృద్ధి పరిచినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. భారతదేశంలో అతి పురాతన పుణ్యధామాలలో ఒకటిగా, మహిమాన్విత ధామాలలో ఒకటిగా పేరుప్రఖ్యాతులు సాధించిన ‘అయోధ్య’కు ఆ పేరు రావడానికి శ్రీరాముడి తాతముత్తాతలే కారణం. శ్రీరాముని తాతలలో ఒకరైన ‘అయుధ’ అయోధ్య క్షేత్రాన్ని పాలించాడు. ఆ కారణంగా ఆయన తదనంతర కాలంలో ఈ క్షేత్రానికి అయోధ్య అనే పేరు వచ్చినట్లు ప్రచారంలో ఉంది. ‘యుధ్’ అంటే సంస్కృతంలో యుద్ధమని, నాశనమని అర్థం. అ‘యుధ్’అంటే నాశనం కానిదని అర్థంగా చెబుతారు. మొగలుల కాలంలో అయోధ్య నగరం ఆగ్రా,కుతుబ్ రాజ్యాల ఆధీనంలో ఉండేది.

వందలాది ఆలయాల నగరం

ఈ క్షేత్రంలో వందకు పైగా ఆలయాలున్నాయి. సూర్యవంశస్థులైన ఇక్ష్వాకుల రాజులెందరో పాలించిన ఈ నగరంలోనే 63వ రాజుగా పట్ట్భాషిక్తుడైన శ్రీరామచంద్రుడు ధర్మస్థాపన చేసి, విశేషమైన పేరు ప్రఖ్యాతులు సాధించాడు. రాముడి తండ్రి దశరథ మహారాజు అయోధ్యలో పుత్రకామేష్టీ యాగాన్ని నిర్వహించాడు. అలాగే హరిశ్చంద్రుడు, రాజసాగరుడు, భగీరధుడు విక్రమాదిత్యుడు గౌతమ బుద్ధుని పాదస్పర్శతో అయోధ్య నగరం పరమ పుణ్యప్రదమైన నగరంగా రూపుదిద్దుకుంది. గౌతమబుద్ధుడు అయోధ్య నగరాన్ని ఐదుసార్లు సందర్శించినట్టు తెలుస్తుంది. చైనా యాత్రికుడు హ్యూయాన్త్సాంగ్ అయోధ్య నగరాన్ని 7వ శతాబ్దంలోదర్శించాడు. ఎందరెందరో ఇక్ష్వాకుల రాజులకు ఆశ్రయమిచ్చిన అయోధ్యలో అనేక మతాలు, వంశాలు కూడా రాజ్యమేలాయి.

సరయూ తీరం ఆహ్లాదభరితం


అయోధ్యలో కాలుమోపిన భక్తులంతా ముందుగా ఇక్కడ సరయూ నదిలో స్నానాదికాలు చేయడం సంప్రదాయం. సరయూ నది ఒడ్డునే లక్ష్మణ మందిరం ఉంది. ఇక్కడ లక్ష్మణుడు కొలువుదీరాడు. దీనికి సమీపంలోనే నాగేశ్వరనాథ్ మందిరం ఉంది. శ్రీరాముని కుమారుడు ‘కుశుడు’ నిర్మించిన ఆలయంగా ఇది ఖ్యాతికెక్కింది. మిగిలిన ఆలయాలన్నీ ముస్లింల దాడులకు అంతరించిపోయినవే.

నాగేశ్వరనాధ్ మందిరానికి సమీపంలో కాలేరామ్ మందిరం ఉంది. సరయూ నదిలో దొరికిన నల్లని సీతాలక్ష్మణ సహిత శ్రీరామచంద్రునివిగ్రహాలు ఇక్కడ ఈ ఆలయంలో ప్రతిష్టించారు. ఇక్కడకు సమీపంలోనే ‘హనుమాన్ ఘడి’ ఉంది. ఇక్కడ నవాబు షాజుద్దౌలా నిర్మించిన రామచంద్రాలయం ఉంది. అయోధ్య నగరం నడిబొడ్డున ఉన్న ఈ మందిరానికి చేరుకోవడానికి 76 మెట్లున్నాయి. హనుమంతుడు ఇక్కడో గుహలో ఉండి రామజన్మభూమిని రక్షించేవాడని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ అంజనీమాత ఒడిలో బాల ఆంజనేయుని మూర్తి దర్శనం భక్తులకు భక్తిపారవశ్యంలో ముంచెత్తుతుంది. దీనికి సమీపంలో ‘కనక భవన్’ ఉంది. కైకేయి మాత సీతామహాసాధ్వికి బహుమతిగా ఇచ్చిన పుణ్యస్థలం ‘కనక భవన్’, బంగారు సింహాసనం ఉన్న ఈ భవనమే శ్రీరామచంద్రుని నివాస స్థలంగా చెబుతారు. బంగారు కిరీటాలు ధరించి రామలక్ష్మణ సీత విగ్రహాలు ఈ మందిరంలో దర్శనమిస్తాయి. ఈ విశాలమైన ఈ ఆలయ ప్రాంగణం నిత్యం భక్తజన సందోహంతో అలరారుతుంది. సదా శ్రీరామనామ స్మరణంతో ఇక్కడి పరిసరాలు మారుమ్రోగుతాయి.

అయోధ్య నగరంలోనే మరోచోట చోటిదేవ్కాళీ మందిరం ఉంది. వీటితోపాటు శ్రీరామ జానకి బిర్లా ఆలయం, తులసి స్మారక భవన్, రామ్కిపౌరి, దతువన్కుండ్, జానకిమహల్, బ్రహ్మకుండ్, లక్ష్మణ్కిలా, రామ్కధా మ్యూజియం, వాల్మీకి రామాయణ మ్యూజియం, సుందర సదన్, హరిహర మందిరం, తులసీదాసు మందిరం, క్షీరేశ్వరుని మందిరాలున్నాయి. ఇవన్నీ చూడదగినవి.

అయోధ్యలో అత్యంత పుణ్యప్రదేశం రామజన్మభూమి ప్రాంతం. ముక్తిక్షేత్రంగా, స్వర్గ ధామంగా పేరు గాంచిన ఈ నగరంలోకి అడుగిడినంత మాత్రానే సమస్త పాపాలు పోతాయని ఇక్కడి స్థల పురాణం చెప్తుంది. సాక్షాత్తు వాల్మీకి మహర్షి రాసిన రామాయణ మహాకావ్యానికి వేదికగా నిలిచిన అయోధ్య నగరం చేరుకోవడం చాలా సులువు. అయోధ్య చిన్న నగరమే అయినప్పటికీ ఇక్కడ భక్తులకు కావల్సిన అనేక వసతులున్నాయి.

రవాణా మార్గం

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు 134 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ నగరానికి సమీపంలో ఉన్న ఫైజాబాద్లో విమానాశ్రయం కూడా ఉంది. అలహాబాద్కు 166 కిలోమీటర్లు, గోరక్పూర్కు 132కిలోమీటర్లు, వారణాసికి 209 కిలోమీటర్లు దూరంలో ఉన్న అయోధ్యను సులువుగా చేరుకోవచ్చు.
– – శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news