కంసవథ.. శ్రీకృష్ణుడి మేనమామ కంసుడి సంహార గాథ..!

-

శ్రీకృష్ణుడు తన మేనమామ అయిన కంసుడ్ని ఎందుకు అంతమొందిస్తాడు. అసలు వీరిద్దరి విరోధం ఏమిటి?? పరమాత్ముడు కృష్ణలీలలు తెలుసుకోవడం మొదలు పెడితే మొదట తెలుసుకోవాల్సింది కంసుడి గురించి.. మరి ఆయన పుట్టుక, మరణం గురించి తెలుసుకుందాం…

రాక్షసుడైన ద్రవిళుడు అనే రాక్షస రాజు వలన పుట్టిన కంసునికీ రాక్షస లక్షణాలు వచ్చాయి. కంసుడు పెరిగి పెద్దవాడు అవుతూనే తండ్రి ఉగ్రసేనుని చెరశాలలో బంధించాడు. తాను రాజయ్యాడు. జరాసంధుని కూతుళ్ళయిన ఆస్తి, ప్రాస్తి ఇద్దరినీ పెళ్ళాడాడు. శిశుపాలునితో స్నేహం చేసాడు. శ్రీ కృష్ణుని తల్లయిన దేవకీ దేవి ఎవరో కాదు కంసుని పిన తండ్రి కూతురు. వసుదేవునికిచ్చి పెళ్ళిచేసారు. చెల్లెలైన దేవకిని కంసుడు ప్రేమగానే చూసుకున్నాడు. అందుకనే చీరసారెల్తో అత్తవారింటికి పంపుతూ ఉన్నాడు. అప్పుడు ఆకాశవాణి పలికింది.

దేవకి అష్టమ (ఎనిమిదవ) గర్భంలో పుట్టినవాడు నిన్ను సంహరిస్తాడని చెప్పడంతో కంసుడు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. చెల్లెలని చూడకుండా కత్తెత్తాడు. వసుదేవుడు బతిమాలాడాడు. ఆ దంపతులిద్దరూ ప్రాణ భయంతో తమకు పుట్టిన బిడ్డలను అప్పగిస్తామని చెప్పడంతో కంసుడు శాంతించాడు. కలతతో కలవరంతో దేవకీ వసుదేవులను చెరశాలలోనే బంధించాడు. పుట్టిన ఆరుగురు పురిటికందుల్ని పురిట్లోనే చంపేసాడు. ఏడవ సంతానం గర్భసంరక్షణ యోగం చేత దేవకి నుండి రోహిణి గర్భానికి చేరింది. ఆ బిడ్డే బలరాముడు. ఆ తర్వాత ఎనిమిదో సంతానం శ్రీకృష్ణుడు.

శ్రీకృష్ణుని యశోద ఇంటికి మార్చి యోగమాయని తెచ్చి దేవకి పక్కన ఉంచాడు వసుదేవుడు. దేవకీ దేవి ఎంత ప్రాధేయపడ్డా ప్రయోజనం లేకపోయింది. కంసుడు వచ్చాడు. తన మృత్యువుగా భావించి ఆపాపని గాల్లోకి విసిరి కత్తి దూయబోయాడు. పైకెగిరిన పాప కింద పడలేదు, ఆకాశంలో అలాగే ఉండి “నిన్ను చంపేవాడు భూమ్మీద ఎక్కడో ఒక చోట పెరుగుతున్నాడు. వస్తాడు. వచ్చి నీ ప్రాణాలు తీస్తాడు” అని పలికింది.

కంసుడికి దిక్కుతోచలేదు. ఊరూరూ ఇల్లిళ్ళూ వెతికాడు. దొరికిన ప్రతి శిశువునూ ఖండ ఖండాలుగా నరికి చంపాడు. అనేక మంది రాక్షసులను బాలకృష్ణుడుని సంహరించడానికి పంపాడు. కానీ వారంతా బాలకృసష్ణుడి చేతిలో చనిపోతారు. తరువాత కూడా కంసుడు మల్ల యుద్ధంలో ఆరితేరిన యోధుల్ని దించాడు. వారిని బలరామకృష్ణులు భీకరంగా ఎదుర్కోవడమే కాదు, వాళ్ళ ప్రాణాలు తీసారు. తన ప్రాణం వీదికి వచ్చిందని కంసుడు గ్రహించాడు. ప్రాణభీతితో ఉన్న కంసుణ్ని జుట్టు పట్టుకొని సింహాసనం మీది నుండి కిందికి తోసేసాడు కృష్ణుడు. అంతే క్షణాల్లో కంసుని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇలా కంస సంహారం జరిగింది.

 

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news