అనంతలో డ్రాగన్ ఫ్రూట్ సాగు..లాభాల బాటలో రైతు..సక్సెస్ స్టోరీ..

-

ఇప్పుడు చాలా మంది రైతులు డ్రాగన్ ఫ్రూట్ ను సాగు చేస్తూ అద్భుతమైన ఫలితాలను అందుకుంటున్నారు.. తాజాగా ఓ అనంత రైతు కూడా ఈ పంటను పండిస్తూ లాభాలను ఆర్జించడంతో పాటు అందరికి ఆదర్శంగా నిలిచాడు..అతని సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి ఏడాది కరువు బారిన పడే అనంత రైతు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాడు. ఇప్పటికే అనేక రకాల పండ్ల తోటల సాగు చేస్తూ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన అనంత రైతన్న మరో ముందడుగు వేశారు..డ్రాగన్ ఫ్రూట్ సాగుకు కొంత మంది రైతులు నడుం బిగించారు. వీరిలో అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో రైతు రమణా రెడ్డి డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేసి అధిక లాభాలు గడిస్తూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు..

తనకున్న మూడున్నర ఎకరం పొలంలో డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేసి ఔరా అనిపిస్తున్నారు. ఎకరాకు ఐదు లక్షల పెట్టుబడితో 2020 సంవత్సరంలో పంట సాగుకు శ్రీకారం చుట్టారు. పంట వేసిన ఏడాది నుంచే దిగుబడి సాధించారు. అయితే మొదటి ఏడాది ఎకరాకు నాలుగు టన్నుల దిగుబడి మాత్రమే వచ్చిందని మరుసటి ఏడాది ఆరు టన్నుల దిగుబడి రాగా ప్రస్తుతం ఎకరాకు పది టన్నుల దిగుబడి తీస్తున్నట్లు రైతు రమణా రెడ్డి ఆనందం వెలిబుచ్చుతున్నాడు. ఒక్కో పండు 1/2 కేజీ వరకు ఉందని పంట ఆరోగ్యంగా ఉండడంతో అధికారేటుకు విక్రయించ గలుగుతున్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎకరాకు రెండువేల మొక్కలు చొప్పున మూడు ఎకరాలకు 6 వేల మొక్కలను థాయిలాండ్ నుంచి దిగుమతి చేసుకున్నారు..

మొక్క ధర 250 రూపాయలు వంతున కొనుగోలు చేశారు. మొదట భూమిని పంటకు అనుకూలంగా మార్చుకొని పది అడుగుల దూరంతో రాతి స్తంభాలు ఏర్పాటు చేసుకోవాలని రైతు చెబుతున్నారు. ఒక్కో స్తంభానికి నాలుగు మొక్కలు వంతున నాటి సంరక్షించుకోవలసి ఉంటుందని వివరించారు. అన్ని పంటలకు వచ్చే తెగుళ్లు డ్రాగన్ ఫ్రూట్ పంటకు దరి చేరవని, కేవలం ఎర్ర చీమల దాడి ఉంటుందని వాటి నివారణకు వేప నూనె పిచికారి చేస్తే సరిపోతుంది..వీటికి నీటితో కూడా పెద్దగా పని లేదు కాబట్టి ఏడాదికి 50 వేల ఖర్చు మాత్రమే ఉంటుంది..
ఇక పోతే ఈ పంటను ఒకసారి వేస్తే 25 – 30 ఏళ్ళ వరకూ దిగుబడిని పొందవచ్చు అంటున్నారు. ఈ పండ్లు తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుండడంతో ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ కు మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర ఉందంటున్నారు. 50 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగల శక్తి ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటకు ఉందని ఇది రాయలసీమ ప్రాంత రైతులకు అనువుగా ఉంటుందని పేర్కొన్నారు..ఇప్పుడు మార్కెట్ లో ఒక్కొదాని ధర 200 వరకూ ఉన్నాయి..మంచి దిగుబడి పొందవచ్చు… ఆ రైతు ఈ పంటలో తోటి రైతులకు సలహాలు సూచనలు ఇస్తున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news