రూ. రెండు కోట్లు సంచిలో వేసుకుని ట్రైన్ ఎక్కాడు… కానీ టికెట్‌ తీయలేదు..అంతే.. 

-

అదృష్టం బస్సులో వస్తే..దరిద్రం ఫ్లైట్‌లో వచ్చిందన్నట్లు…ఇక్కడ ఓ అతనికి దురదృష్టం ట్రైయిన్‌లో వచ్చింది. రెండు కోట్ల డబ్బును సంచిలో వేసుకుని ట్రైయిన్‌ ఎక్కాడు. మరి కంగారో, భయమో తెలియదు కానీ.. మనోడు మొత్తానికి టికెట్‌ లేకుండానే ట్రైయిన్‌ ఎక్కేశాడు..సీన్‌ కట్‌ చేస్తే.. బండారం బట్టబయలైంది.. ఇదేదో సినిమా కథ కాదు.. నిజంగానే జరిగింది..! రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…
అతడి చేతిలో కోట్ల రూపాయల డబ్బుంది. బ్యాగు నిండా నోట్ల కట్టలే ఉన్నాయి. మొత్తం రూ.2 కోట్ల వరకు ఉంటుంది. అంతడబ్బున్న అతడు.. సాధారణ ప్రజలు వెళ్లే రైలు (Indian Railways)లో ఎక్కాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ అతడు ట్రైన్ టికెట్ తీసుకోలేదు. టికెట్ లేని ప్రయాణం నేరమని తెలిసినా.. ఎంచక్కా రైలులో వెళ్లాడు. అన్ని కోట్లు చేతిలో ఉన్నా.. ఐదారు వందలు పెట్టి.. టికెట్‌ను కొనలేదు. అసలేంటీ కథ? అంత డబ్బుతో అతడు రైలెందుకు ఎక్కాడు? కోట్లు చేతిలో ఉన్నా.. టికెట్ ఎందుకు కొనలేదు.?
రాజస్థాన్‌లోని సుంత్రా జిల్లా జాలోర్ తాలుకా వారన్వా గ్రామానికి చెందిన జెన్ సింగ్ అలియాస్ మనోహర్ సింగ్ జూన్ 8న.. ముంబైలోని ఛత్రపతి శివాజి టెర్మినస్ నుంచి మంగళూరు వెళ్లే రైలు ఎక్కాడు. రైలు మహారాష్ట్ర సరిహద్దు దాటింది. అంతలోనే టీసీ వచ్చాడు.. అందరిని టికెట్‌ చూపించమని అడిగాడు.. జైన్‌ సింగ్‌ దగ్గర టికెట్‌ లేకపోవడంతో.. లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడు. జైన్‌ సింగ్‌ ప్రవర్తన ఏదో తేడాగా అనిపించి… టికెట్ కలెక్టర్‌ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌కు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత రైల్వే ఇన్‌స్పెక్టర్ విపిన్ సింగ్ రాణా రైలు ఎక్కి.. జన్‌సింగ్ వద్దకు వెళ్లాడు. టికెట్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించాడు. అతడు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో.. పోలీసులకు అనుమానం వచ్చింది. బ్యాగ్‌లో ఏమున్నాయని అడిగితే.. బట్టలు తప్ప ఏమీ లేవని సమాధానం చెప్పాడు. కానీ పోలీసులు నమ్మలేదు. బ్యాగ్ తెరిచి చూస్తే.. అందులో నోట్ల కట్టలు కనిపించాయి. మొత్తం రూ.2 కోట్ల నగదు ఉందని పోలీసులు తెలిపారు. అవి కూడా.. అన్నీ రూ.2వేల నోట్లే. ఆ డబ్బునంతా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రైలు కర్వార్‌‌లోని శిరవాడ రైల్వే స్టేషన్‌ చేరుకున్న తర్వాత.. రైల్వే పోలీసులు అతడిని స్థానిక పోలీసులకు అప్పజెప్పారు. ఆ డబ్బు ఎక్కడిది అని పోలీసులు అడగ్గా.. అదంతా హవాలా డబ్బుని.. మంగళూరులో ఓ వ్యక్తికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నాడని తెలిసింది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడు ఇచ్చిన వివరాల ఆధారంగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. చిన్న తప్పుకు మొత్తం ఆగం ఆగమైంది.. మనోడు..ట్రైన్‌ ఎక్కేప్పుడే.. టికెట్‌ తీసుకుని ఉంటే..ఇంత సీన్‌ జరిగేది కాదు..! బిగినర్స్‌ మిస్టేక్స్‌ ఇవన్నీ.. అని డీజే టిల్లు అన్నట్లు అయింది మొత్తానికి..!

Read more RELATED
Recommended to you

Latest news