కలియుగం కాలపరిమితి ఎంత..? ఇంకా ఎన్ని ఏళ్లు మిగిలి ఉన్నాయి..?

-

ఇప్పుడు ఉన్న కాలాన్ని కలియుగం అంటారని.. దీనికి ముందు మూడు కాలాలు ఉండేవి అని అందరికి తెలుసు. కానీ ఏ యుగాన్ని ఎవరు పరిపాలించారు, ఏ యుగం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనే ఐడియా ఈ జనరేషన్‌ వాళ్లకు ఉండకపోవచ్చు. మనం ఈ యుగాల గురించి.. అప్పట్లో ధర్మం ఎలా ఉండేదో చూసుకుందాం.

మొదటి యుగం అయిన సత్యయుగంలో ధర్మం నాలుగుపాదాలపై నడిచింది. అందుకే ఇప్పటికీ ఈ పదం వాడుతుంటారు. ఇక రెండో యుగమైన త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది. మూడో యుగం ద్వాపరయుగంలో రెండు పాదాలపై నడిచింది. ప్రస్తుతం నడుస్తోన్న కలియుగంలో ధర్మం, మంచి అనే మాటలకు చోటే లేదు.

సత్యయుగం

నాలుగు యుగాల్లో మొదటిది సత్యయుగం. దీన్నే కృతయుగం అని కూడా అంటారు. ఈ యుగంలో భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సహితంగా భూమిని పరిపాలించాడు. దీని కాల పరిమాణం 17 లక్షల 28 వేల సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడిచిందని శివపురాణం చెబుతోంది. ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉన్నారట. అకాల మరణాలు అస్సలు లేనేలేవు. కృత యుగానిరి రాజు సూర్యుడు, మంత్రి గురువు. గురువు బంగారానికి అధిపతి కానడంతో అంతా బంగారుమయం. ప్రభువు-ప్రజల మధ్య ఎలాంటి విభేదం, విరోధం లేకుండా కాలం చక్కగా నడిచింది. సూర్య ప్రభావంతో సుక్షత్రియులు, గురు ప్రభావంతో సద్బ్రాహ్మణులు జన్మించి ధర్మమైన పాలన నడిచింది. సత్యయుగం వైవశ్వత మన్వంతరంలో కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమైంది.

త్రేతాయుగం

ఇక రెండోవది త్రేతాయుగం. ఇందులో భగవంతుడు శ్రీ రామచంద్రుడుగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. ఈ యుగం పరిమితి 12 లక్షల 96 వేల సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది. త్రేతాయుగంలో రాజుగా కుజుడు, మంత్రిగా శుక్రుడు ఉన్నారు. కుజుడు యువకుడు, యుద్ధప్రియుడు, సుక్షిత్రుయుడు, బాహుబల పరాక్రమవంతుడు, రాజుగా ఆచారాలకు కట్టుబడి ఉండకుండా తిరిగేవాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు స్త్రీ కారకుడు మాయ మంత్ర తంత్రవాది, కుజుడుకి పరమ శత్రువు. రాజుమాటకి మంత్రి మాటకి పడకపోవడం వల్ల మంత్రులు క్రూర స్వభావులై రాజ్యపాలనను బ్రష్టు పట్టించారు. స్త్రీ వ్యామోహంతో కలహాలు పెంచి దైవకార్యాలు నిర్వహించే వంశాలను అంతరించేలా చేశారు. ఇలా రాక్షసులు, దుర్మార్గుల వలన త్రేతాయుగంలో ధర్మం ఒకభాగం దెబ్బతిని మూడుపాదాలపై నడిచిందంది. ఈ యుగము వైశాఖ శుద్ధ తదియ రోజు ప్రారంభమైంది.

ద్వాపర యుగం

శ్రీ మహావిష్ణువు శ్రీ కృష్ణుడుగా అవతరించాడు. దీని కాల పరిమాణం 8 లక్షల 64 వేల సంవత్సరాలు. ద్వాపర యుగంలో రాజుగా చంద్రుడు, మంత్రిగా బుధుడు ఉన్నారు. చంద్రుడిది గురు వర్గం. బుధుడిది శనివర్గం. అందుకే వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. బుధుడు చెడు విద్యలను రాక్షసులకు , దుర్మార్గులకు ఇచ్చి సాధువులు, సజ్జనులు, స్త్రీలకు అపకారం చేయమని పురికొల్పుతాడు. దేవతా కార్యాలను సగానికి సగం నశింపచేసి రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదం కల్పిస్తాడు. చంద్రుడు సకలవిద్యా పారంగతుడు. రాజులను విద్యా పారంగతులను చేసి..ధనుర్విద్యలు నేర్పించి… దుష్టులను-మాయావులను నాశనం చేయడానికి సహకరిస్తాడు. ఈ విధంగా ద్వాపర యుగంలో ధర్మం రెండు భాగాలు నశించి కలియుగం ప్రారంభమవుతుంది.

కలియుగం

కలియుగం కాలపరిమితి 4 లక్షల 32 వేల సంవత్సరాలు. అందులో సుమారు ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి. హిందూ , బౌద్ధ కాలమానాలకు ఆధార గ్రంధమైన సూర్య సిద్ధాంతం ప్రకారం పూర్వ శఖము 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారమును చాలించాడని భావిస్తారు. కలియుగానికి రాజు శని…మంత్రులు రాహు-కేతువులు. మంత్రులిద్దరికీ ఒకరకంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కలియుగం ఆరంభంలో నాలుగు ధర్మ శాస్త్రాలు…వాటిని రక్షించే బ్రాహ్మణులను, అగ్రహారాలను , రాజులను నశింపచేస్తూ వచ్చారు. అప్పటి నుంచి క్రూరత్వం, అసత్యం, అప్రమాణం, అధర్మం, అన్యాయం తలెత్తాయి.

ఈ యుగంలో వావి-వరుసలు తప్పి, వర్ణ సంకరములు మొదలై దొరలే దొంగలయ్యారు. దైవభక్తి తగ్గి హింసా సిద్ధాంతాలు పెరిగాయి. పాపం వల్ల దుఖం అనుభవిస్తాం అనే భయంపోయి… స్త్రీని, ధనాన్ని పొందినవాడే గొప్పవాడని అనుకునే రోజులొస్తాయి, అధర్మం పెరుగుతుంది, వర్ణద్వేషాలు, మత విద్వేషాలు పెరుగుతాయి, ఒక్క మాటలో చెప్పాలంటే కలియుగంలో మంచి అనే మాటకి చోటు లేకుండా అధర్మానికే మొగ్గు చూపుతారు. కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని శివపురాణం చెబుతోంది. ఈ యుగం అంతరించడానికి ఇంకా 4,26,899 సంవత్సరాలు మిగిలున్నాయట.

Read more RELATED
Recommended to you

Latest news