ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కీలక అడుగు ముందుకు పడింది. అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. మొత్తం రూ.4.285 కోట్ల నిధులు రిలీజ్ చేసింది. అమరావతి నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధుల నుంచి 25 శాతం ఇచ్చింది. ఇందులో కేంద్రం వాటా రూ.750 కోట్లు కలిపి మొత్తం రూ.4285 కోట్లు ఉండగా.. పనులు ప్రారంభం అవుతున్న దృష్ట్యా 25 శాతం నిధులు అడ్వాన్స్గా ఇవ్వాలని సీఆర్డీఏ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సీఆర్డీఏ వినతితో కేంద్ర సర్కార్ తాజాగా నిధులను విడుదల చేసింది.
ఇక కేంద్ర బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మరోవైపు అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.