బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బల్లికురవ మండలంలోని ఓ గ్రానైట్ క్వారీలో శనివారం ఉదయం బండరాయి జారి పడటంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను ఒడిశాకు చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. కాగా, ప్రమాదం గురించి సమాచారం తెలియగానే ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకుని గాయపడిన కార్మికులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో క్వారీలో సుమారు 16 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, గ్రానైట్ క్వారీలో కూలిన శిథిలాలను క్వారీ సిబ్బంది తొలగిస్తున్నారు. క్వారీలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రమాద ఘటనపై విచారణ జరపాలని అధికారులను సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. అనంతరం గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సీఎం ఆదేశించారు.