ఏపీ రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడ్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. వైద్యం, ఆరోగ్యంపై మీడియా ఎదుట పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధుల వివరాలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆస్పత్రుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కుప్పంలో డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల్లో హైపర్టెన్షన్ అధికంగా కనిపిస్తోందని.. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని చెప్పారు. చాలా వ్యాధులు నివారించాలంటే.. ప్రతి ఒక్కరు మంచి ఆహారపు అలవాట్లు పాటించాల్సిందేనని వెల్లడించారు. వంటనూనె కూడా రోజుకు 15 గ్రాములు చొప్పున నెలకు 2 లీటర్లు మాత్రమే వినియోగించాలని వివరించారు. ఉప్పు, వంటనూనె, చక్కెర వినియోగం తగ్గిస్తే చాలా వరకు అనారోగ్య సమస్యలు దరిచేరే అవకాశం ఉండదన్న సీఎం.. రోజుకు కనీసం అరగంట పాటు తేలికపాటి వ్యాయామం చేయాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.