రేషన్ షాపుల పునఃప్రారంభంపై ఎక్స్ వేదికగా స్పందించారు మాజీ సీఎం వైఎస్ జగన్. పేదలకు మళ్లీ రేషన్ కష్టాలు తెస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇంటి దగ్గరకే వస్తున్న సేవలపై మీకెందుకు కక్ష? అని మండిపడ్డారు. వైసీపీ తీసుకొచ్చిన 9,260 రేషన్ వాహనాలపై దాదాపు 20 వేల మంది ఆధారపడ్డారన్నారు. వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం? అని నిలదీసారు వైఎస్ జగన్.

చంద్రబాబు ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? మళ్లీ పేదలకు “రేషన్’’ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలికానీ, వారిని కష్టపెట్టడం సబబేనా? ప్రభుత్వ సేవల డోర్డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా? అని మండిపడ్డారు.
మరోవైపు వైయస్సార్సీపీ తీసుకొచ్చిన 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20వేలమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్టకొట్టడం, వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? పారదర్శకంగా ఇంటివద్దకే వచ్చి సేవలు అందిస్తూ, వరదలు, విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా సేవలందించిన ఈ వాహనాలను తొలగించడం సరైనదేనా? పైగా ఈ సేవలందించిన వారిని ఉద్దేశిస్తూ వారు స్మగ్లర్లుగానూ, మాఫియా ముఠా సభ్యులుగానూ చిత్రీకరించేలా నిన్న మీరుచేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవు అని పేర్కొన్నారు.