మన దేశాన్ని రక్షించే శక్తి ప్రధాని నరేంద్ర మోడీకి ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం చాయాపురంలో ఇవాళ ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం యుద్ధ వాతావరణంలో ఉందన్నారు. టెర్రరిస్టులు దాడులతో దేశం మొత్తం చలించి పోయిందని చెప్పారు. మనదేశం టెర్రరిజానికి ఎల్లప్పుడూ వ్యతిరేకం అన్నారు. పహల్గామ్ లో మన వారిని ఇష్టానుసారంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రవాదానికి ప్రపంచంలో చోటు లేదని ప్రధాని మోడీ ఎప్పుడూ చెబుతుంటారని గుర్తు చేశారు.
పాకిస్తాన్ మనపైనే దాడులు చేస్తూ కవ్వింపు చర్యలు చేస్తుందని మండిపడ్డారు దేశం కోసం ఎంతో మంది యువకులు రక్షణ రంగంలోకి వెళ్తున్నారని తెలిపారు. మన తెలుగు వాడు మురళీ నాయక్ ఉగ్రవాదులతో పోరాటి వీర మరణం పొందడం చాలా బాధ కలిగించిందన్నారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడి.. ప్రగాఢ సానుభూతి తెలియజేసినట్టు తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.