వివాదాల సెన్సేష‌న్‌… సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజు

-

కొంద‌రిపేరులోనే సెన్సేష‌న్ ఉంటుంది. అలాంటి వారిలో ప్ర‌స్తుతం రాష్ట్రం, దేశ‌వ్యాప్తంగా కూడా వినిపిస్తు న్న స‌న్సేష‌న‌ల్ పేరు ఏదైనా ఉంటే.. అది సంచయిత గ‌జ‌ప‌తిరాజు. సింహాచ‌ల్ దేవ‌స్థానం పాల‌క మండలి చైర్‌ప‌ర్స‌న్‌గానే కాకుండా మాన్సాస్ చైర్మ‌న్‌గా కూడా సంచ‌యిత అనూహ్య రీతిలో నియామ‌కం పొందారు. నిజానికి గ‌జ‌ప‌తి రాజుల కుంటుంబం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ నాయ‌కుడు, మాజీ ఎంపీ అశోక్ గజ‌ప‌తి రాజు వీటికి చైర్మ‌న్‌గా ఉన్నారు. అయితే, రాష్ట్రంలో టీడీపీ ప్ర‌భుత్వం పోయి.. వైసీపీ వ‌చ్చిన త‌ర్వా త మాత్రం ప‌రిస్థితి మారిపోయింది. సింహాచ‌లం స‌హా గ‌జ‌ప‌తుల కుటుంబానికే చెందిన మాన్సాస్ ట్ర‌స్ట్ నుంచి అశోక్‌ను త‌ప్పించేశారు.

క‌రోనా నేప‌థ్యంలో లాక్‌డౌన్ కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా తీసుకున్న నిర్ణ‌యంతో బీజేపీకి చెందిన నాయ‌కురాలు.. అప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌ని సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజు తెర‌మీదికి వ‌చ్చారు. సింహాచ‌లం దేవ‌స్థానం స‌హా మాన్సాస్‌కు ఆమె చైర్‌ప‌ర్స‌న్ అయ్యారు. అయితే, ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. అనూహ్యంగా అశోక్‌ను తొల‌గించ‌డంపై రాజ‌కీయంగా దుమారం రేగితే.. సంచయిత విష‌యంలో మ‌రో కోణంలో వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. సోష‌ల్ మీడియా సహా ఓ పార్టీకి అనుకూలంగా ఉండే ప్ర‌ధాన మీడియాలో నూ సంచ‌యిత క్రిస్టియానిటీకి సంబంధించిన వివాదాస్ప‌ద అంశాలు తెర‌మీదికి వ‌చ్చాయి.

క్రిస్టియానిటీని స‌మ‌ర్ధించే సంచ‌యిత‌ను హిందూ ఆల‌యానికి ఎలా చైర్ ప‌ర్స‌న్ చేస్తారంటూ.. విమ‌ర్శ‌లు చుట్టుముట్ట‌డం తెలిసిందే. అదే స‌మ‌యంలో బీజేపీకి చెందిన నాయ‌కురాలికి వైసీపీ ఈ ప‌ద‌వుల‌ను ఎలా క‌ట్ట‌బెడుతుంద‌నే వివాదం కూడా తెర‌మీదికి వ‌చ్చింది. అయినా కూడా సంచ‌యిత వీట‌న్నింటినీ తాను కోర్టులోనే తేల్చుకుంటాన‌ని బ‌దులిచ్చారు త‌ప్ప‌.. ఎక్క‌డా ప్ర‌తి విమ‌ర్శ‌లు చేయ‌లేదు. ఇక తాజాగా మ‌రో వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. సంచ‌యిత త‌న‌కు వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శిగా చెన్నైకి చెందిన మోహ‌న్‌కుమార్ అనే వ్య‌క్తిని నియ‌మించుకున్నారు. అయితే, ఇటీవ‌ల ఆయ‌న సింహాచ‌లానికి వ‌చ్చారు.

నిజానికి చెన్నైలో క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డి నుంచి వ‌చ్చిన వారిని క్వారంటైన్‌కు పంపాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ప్ర‌భుత్వం కూడా అదే చేస్తోంది. అయితే, సంచ‌యిత కార్య‌ద‌ర్శి మాత్రం నేరుగా ఆల‌యానికి వ‌చ్చి ప‌నులు చ‌క్క‌బెట్టుకుని వెళ్లారు. దీంతో ఇప్పుడు ఈ అంశం వివాదానికి దారితీసింది. దీనిపైనా సంచ‌యిత నుంచి ఎలాంటి స్పంద‌నా రాలేదు. ఈ మొత్తం వ్య‌వ‌హారం అంతా కూడా తీవ్ర వివాదాల‌కు దారితీస్తోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వివాదాల సంచిత‌.. సంచ‌యిత అంటూ.. సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news