తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. వేసవికాలం సెలవులు ముగియనుండడంతో విపరీతంగా భక్తులు తిరుమల శ్రీవారి వద్దకు చేరుకుంటున్నారు. దాదాపు దర్శనానికి 20 గంటలకు పైనే సమయం పడుతుంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఒకరోజు సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 95, 080 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.47 కోట్లు వచ్చింది.

తలనీలాలు 15,000 మంది సమర్పించుకున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి భోజన సదుపాయాలను తిరుమల అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. పాలు, నీరు, భోజనం, పండ్లు అందజేస్తున్నారు. కాలినడకన వచ్చే భక్తులకు సెక్యూరిటీని కల్పిస్తున్నారు. రానున్న రెండు మూడు రోజులు వర్షాలు అధికంగా ఉన్న నేపథ్యంలో భక్తుల సంఖ్య రెండు మూడు రోజులలో కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని గ్రహించి భక్తులు తిరుమలకు చేరుకోవాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.