గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడమంటే భారతీయ సంస్కృతిని కాపాడటమే అని సీఎం చంద్రబాబు అన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాల పెంపునకు నిరంతరం కృషి చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. వారి హక్కులను కాపాడతామన్నారు. పాడేరులో గిరిజనుల నిరసన నేపథ్యంలో ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు.
గిరిజనుల విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు నిరంతరం పని చేస్తున్నాం. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. అరకు కాఫీ సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో జీవో నెంబర్ 3 తీసుకురావడం ద్వారా గిరిజనులకే దక్కేలా కృషి చేశాం. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వులు రద్దు అయ్యాయి. దాని పునరుద్ధరణకు మేము కృషి చేస్తామని గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై వారికే హక్కు ఉండాలనే ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. అలాంటి తప్పుడు ప్రచారాలు, అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని గిరిజన సోదరులను కోరుతున్నానని తెలిపారు.