వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. ఆయనకు విజయవాడ AJFCM కోర్టు ఇవాళ (ఏప్రిల్ 1వతేదీ) రిమాండ్ పొడిగించింది. తమ భూమిని బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలపై అత్కూరు పోలీసు స్టేషన్లో వంశీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన వంశీకి తాజాగా న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు రిమాండ్ను పొడిగిస్తూ విజయవాడ AJFCM కోర్టు తెలిపింది. ఇదే కేసులో వంశీని ఒకరోజు పోలీసుల కస్టడీకి ఇచ్చింది.
మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు (A1) మోహన్ రంగాను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మోహన్ రంగాను అధికారులు మూడు రోజుల పాటు విచారించనున్నారు. అయితే ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఆయన అజ్ఞాతంలోకి జారుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆయణ్ను కస్టడీ కోరగా సీఐడీ కస్టడీకి అనుమతి ఇస్తూ విజయవాడ AJFCM కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.