కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు అరెస్టు వారెంట్

-

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనపై పోక్సో కేసు కూడా నమోదైంది. తాజాగా బెంగళూరు కోర్టు గురువారం ఆయనపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్  జారీ చేసింది. త్వరలోనే ఆయనను అరెస్టు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ కేసులో అవసరమైతే యడియూరప్పను అరెస్టు చేస్తామని ఈ ఉదయం రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కేసు విచారణ నిమిత్తం సీఐడీ అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే, ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నందున జూన్ 17న సీఐడీ ముందు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

17 ఏళ్ల బాలికపై యడియూరప్ప  లైంగిక దాడికి పాల్పడినట్లు లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి ఫిబ్రవరి 2న యడ్యూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను బీజేపీ నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసుపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఆరోపణలు చేసిన బాధితురాలి తల్లి ఇటీవల ఊపిరితిత్తుల క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోయారు. అంతకంటే ముందే బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను సీఐడీ రికార్డ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news