బీ టౌన్‌లో ఐటీ దాడులు వెనుక హస్తం వారిదేనా

-

బాలీవుడ్‌లో ఐటీ దాడులు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. నటి త్యాప్సీతో పాటు దర్శకనిర్మాత అనురాగ్‌ కశ్యప్‌, వికాస్‌ బెహెల్‌ పలువురు సినీ ప్రముఖుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే.. త్యాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌లపై ఐటీ రైడ్స్‌ సంచలనంగా మారాయి. అయితే ఐటీ అధికారులు మాత్రం పన్ను ఎగవేశారన్న ఆరోపణలతో సోదాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ముంబైలోని పలు సినీ ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. హీరోయిన్‌ త్యాప్సీతో పాటు నిర్మాత మధు మంతెన, దర్శకుడు వికాస్‌ బెహల్‌ ఇంట్లో రైడ్స్‌ జరిగాయి. అనురాగ్‌ కశ్యప్‌కి చెందిన ఫాంటమ్‌ ఫిల్స్మ్‌, టాలెంట్‌ హంట్‌ కంపెనీ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నట్లు ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. త్యాప్సీ ఇళ్లు, ఆస్తులతో పాటు ఆమె సినీ వ్యవహారాలు చూస్తున్న కేఆర్‌ఐ ఎంటర్టైన్మెంట్స్‌ కార్యాలయాల్లోనూ రైడ్స్‌ సాగుతున్నాయి.

నటి త్యాప్సీ, దర్శక నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సాగు చట్టాలతో పాటు అనేక విషయాలపై స్పందించారు. ఇటీవల త్యాప్సీ ఆయా అంశాలపై వివాదాస్పద ట్వీట్లు చేసింది. అటు అనురాగ్‌ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ట్వీట్లు చేశారు. జనవరి 26న రైతుల ట్రాక్టర్‌ పరేడ్‌ ఘటనలపై త్యాప్సీ చేసిన ట్వీట్స్‌ ప్రకంపనలు రేపాయి. పాప్‌ సింగర్‌ రిహాన్న ట్వీట్‌ అనుకూలంగా స్పందించిన నటి త్యాప్సీ. ఈ అంశంపై త్యాప్సీతో పాటు కంగనా మధ్య ట్విట్టర్‌ వార్‌ కూడా జరిగింది.

అటు త్యాప్సీ, ఇటు అనురాగ్‌ కశ్యప్‌లు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారారు. అందుకే కేంద్రం ఐటీని రంగంలోకి దించిందన్న ఆరోపణలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. ఆదాయపన్ను శాఖ అధికారులు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతోనే సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముంబై, పుణేతో పాటు మొత్తం 30 ప్రాంతాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ దాడులను స్వాగతిస్తున్నట్లు చెప్పారు నటి పాయల్‌ ఘోష్‌. వాళ్ల ఆస్తులపై సోదాలు జరగాలని చెప్పారు. నిర్మాణ సంస్థ పేరుతో వీళ్లు.. చాలా చేశారని ఆరోపించారు.

ఫాంటమ్‌ ఫిల్మ్స్‌ను అనురాగ్‌ కశ్యప్‌, డైరెక్టర్‌ విక్రమాదిత్య మొత్వానే, నిర్మాత మధు మంతెనతో పాటు వికాస్‌ బెహల్‌లు కలిసి ఏర్పాటు చేశారు. 2011లో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి.. 2018లో మూసివేస్తున్నట్లు చెప్పారు. అయితే ఇప్పుడు ఐటీ దాడులు జరగడం సంచలనంగా మారింది. ఈ అంశం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఇండస్ట్రీలోని మరికొంత మందిపై దాడులు జరుగుతాయా..అన్నది హాట్‌ టాపిక్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news