వెయ్యి ఆవులను ఇస్తా.. చంద్రబాబుకు బీసీవై పార్టీ అధ్యక్షుడు లేఖ!

-

తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ సీఎం చంద్రబాబునాయుడికి ఓ లేఖ రాశారు. తను వెయ్యి ఆవులను ఇస్తానని.. టీటీడీకి సొంత డెయిరీని ఏర్పాటు చేసి..ఆ నెయ్యినే లడ్డూ ప్రసాదాల తయారీకి వాడాలని ఆ లేఖలో పేర్కొన్నారు. తిరుమలకు రోజుకు 50 వేల నుంచి లక్ష మంది వరకూ భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. సగటున రూ.3 నుంచి రూ.5 కోట్ల వరకూ రోజువారీ ఆదాయం ఉంటుంది.

అలాంటప్పుడు టీటీడీకి సొంత డెయిరీ ఎందుకు ఉండకూడదు. సొంత డెయిరీ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటే తన వంతు బాధ్యతగా వెయ్యి ఆవులను ఇస్తానని రామచంద్రయాదవ్ తెలిపారు. అంతేకాకుండా, మరో లక్ష ఆవులను ఉచితంగా తిరుమలకు తరలిస్తానని చెప్పారు. రోజుకు లక్ష ఆవుల నుంచి 10 లక్షల లీటర్ల ఆవుపాలు ఉత్పత్తి అయినా వాటి నుంచి 50 వేల కేజీల వెన్న వస్తుంది. దాంతో సుమారు 30 వేల కేజీల నెయ్యి తయారవుతుంది. ఆ నెయ్యిని స్వామివారి ధూప, దీప, నైవేధ్యాలకు వాడి.. మిగిలిన దాన్ని రాష్ట్రంలోని ఇతర ఆలయాలకు కూడా ఉపయోగించవచ్చని తెలిపారు. ఇలా చేస్తే లడ్డూ ప్రసాదాల్లో కల్తీ జరగదని చెప్పారు. ఇక టీటీడీ పాలకమండలిలో కేవలం ఆధ్యాత్మిక గురువులు,ధార్మిక ప్రతినిధులు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news