సీఎం కేసీఆర్ పై.. గవర్నర్ కు బీజేపీ ఫిర్యాదు

-

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రతినిధి బృందం కలిసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల స్పూర్తికి విరుద్ధమైన ఉద్యోగుల బదిలీల ప్రక్రియను తక్షణమే నిలిపేయడంతోపాటు 317 జీవోను సవరించాలని కోరుతూ ఈ సందర్భంగా వినతి పత్రం అందజేశారు బీజేపీ నేతలు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నినాదం ‘నీళ్లు-నిధులు-నియమాకాలు’కు విరుద్ధంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలు జరుగుతున్నాయని కేసీఆర్‌ సర్కార్‌ పై ఫిర్యాదు చేశారు.

ఈ ఉత్తర్వులు 3 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలను తీవ్ర మనో వేదనకు గురి చేస్తున్నాయని… 317 జీవో అమలువల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇతర జిల్లాల్లోనే స్థానికేతరులుగా మారే ప్రమాదం ఏర్పడిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ జీవో అమలైతే మారుమూల ప్రాంతాల్లో మరో 2,3 దశాబ్దాలపాటు ఉద్యోగ ఖాళీ అయ్యే అవకాశమే ఉండదని. దీనివల్ల ఆయా ప్రాంతాల నిరుద్యోగులకు తీవ్ర నష్టమని ఆందోళన చేశారు. 317 జీవోలోని 28వ పేరా రాష్ట్రపతి ఉత్తర్వులను, రాజ్యాంగాన్ని ధిక్కరించేలా ఉందని ఫిర్యాదు చేశారు బీజేపీ లీడర్లు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించిన తర్వాతే నూతన గైడ్ లైన్స్ రూపొందించి బదిలీలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కేటాయింపులో స్థానికతను ప్రామాణికంగా తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగానే బీసీ ఉద్యోగులకూ తప్పనిసరిగా ‘ఆప్షన్ ఫార్మెట్’ కాలమ్ ను వర్తింపజేయాలని..ఉద్యోగుల బదిలీల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి బిశ్వాల్ (పీఆర్సీ) కమిటీ గుర్తించిన 1.92 లక్షల ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version