నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. బాలాలయంలో స్వామివారిని దర్శించుకొని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. 10 గంటలకు హెలికాప్టర్ లో ప్రగతి భవన్ నుండి బయలుదేరుతున్న సీఎం 11 గంటలకు యాదగిరిగుట్ట కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. సీఎం పర్యటన సందర్భంగా కలెక్టర్ అనిత రామచంద్రన్, డీసీపీ నారాయణ రెడ్డి ఏర్పాట్లు పరిశీలించారు.
ఇప్పటికే 90 శాతానికి పైగా గుడి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. యాదాద్రికి నలువైపులా విశాలమైన మాఢవీధులు, సప్త గోపురాలు, అంతర్ బాహ్య ప్రాకారాలు, ఆల్వార్ల విగ్రహాలతో కాకతీయ సంప్రదాయ కృష్ణ శిలా శిల్ప సౌరభం ఉట్టిపడేలా పనులు జరిగాయి. శివాలయం నిర్మాణం కూడా దాదాపు పూర్తయింది. అయితే దేవాలయ పరిశీలన అనంతరం కేసీఆర్ ఆలయ ప్రారంభ తేదీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. జరిగిన పనులు, కొనసాగుతున్న పనులపై ఓ అంచనాకు వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.