కోనోకార్పస్ చెట్లను తొలగించాలనే నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం విరమించుకోవాలని సీసీఎంబీ మాజీ డైరెక్టర్, జనచైతన్య వేదిక అధ్యక్షులు ప్రొఫెసర్ వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు. కోనోకార్పస్ చెట్లపై అపోహలు వీడాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోనోకార్పస్ చెట్లు ఆక్సిజన్ను పీల్చుకుని కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తుందని గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉన్న గడ్డం ప్రసాద్ అశాస్త్రీయమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు.
కోనోకార్పస్ చెట్లు అత్యధికంగా కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ను సైతం అధికంగా విడుదల చేస్తాయని పరిశోధనలో తేలిందన్నారు. నీటి లభ్యత లేకున్నా ఈ చెట్లు పెరుగుతాయని, దుబాయి లాంటి దేశాల్లో వీటిని పెంచుతున్నారని గుర్తుచేశారు.తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా ఆ చెట్లను నరకడం మానుకోవాలని లేనిపక్షంలో సుప్రీంకోర్టులో ప్రజావ్యాజ్యం వేస్తామన్నారు. కోనోకార్పస్ చెట్లను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు.