అతను ఒక బాధ్యత కలిగిన ఉన్నతాధికారి. ఆ విషయం మరిచిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో అత్యంత దారుణంగా వ్యవహరించారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు సోమవారం రాత్రి గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఉన్నతాధికారి పై కేసు నమోదు అయింది. పోలీసుల వివరాల్లోకి వెల్లితే.. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో నెల్లూరు డీఐజీగా పనిచేస్తూ ప్రస్తుతం సెలవులో ఉన్న కిరణ్ కుమార్ ఎల్బీసీలో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. అనసూయ రాణిని కొన్నేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం పోస్టల్ కాలనీలో నివాసం ఉంటున్నారు.
ఈ దంపతుల మధ్య విభేదాలు రావడంతో ఏడాది నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఆదివారం రాత్రి దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కిరణ్ కుమార్ అనసూయ రాణి పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆమె స్పృహ కోల్పోయారు. స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందిన అనంతరం బాధితురాలు గుంటూరు అరండల్పేట స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కిరణ్ కుమార్ గతంలో గుంటూరు స్టాంప్స్, రిజిస్ట్రేషన్ డీఐజీగా విధులు నిర్వహించారు.