రిస్క్‌ ఉందని నాకు తెలుసు: ట‌్రంప్‌

-

కొవిడ్ బారిన‌ప‌డి మిలిటరీ ఆస్పత్రిలో నాలుగు రోజులపాటు చికిత్స పొందిన అమెరికా అధ్య‌క్షుడు
డొనాల్డ్‌ ట్రంప్‌ తిరిగి వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. లక్షలాది మంది ప్రాణాలు బలిగొని, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేసిన కరోనా వైరస్‌ తీవ్రతను తక్కువగా అంచనా చేసిన ట్రంప్‌తో పాటు ఆయ‌న భార్య మెలానియా ట్రంప్‌ కూడా కొవిడ్‌-19 బారిన పడి ద‌వాఖాన‌లో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ నేప‌థ్యంలోనే ట్రంప్ సోమవారం రాత్రి తిరిగి అధ్యక్ష భవనానికి వచ్చారు. మెరైన్‌ వన్‌ హెలికాప్టర్‌లో వైట్‌హౌస్‌కు చేరుకున్న ట్రంప్‌ ఉత్సాహంగా ఫిట్‌గా ఉన్నట్లు చూపడానికి.. మాస్కు తీసేసి ఎలివేటర్‌కు బదులుగా పోర్టికో మెట్లద్వారా బాల్కనీకి చేరుకున్నారు.

అనంతరం ఆయ‌న ట్విట్టర్లో ..‘2.10 లక్షల మంది ప్రజలు చనిపోయినా భయపడాల్సిన పనిలేదు’ అని పేర్కొన్నారు. ‘ప్రత్యర్థి బైడెన్‌తో ఈనెల 15వ తేదీన మియామీలో జరగనున్న డిబేట్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నా’ అని తెలిపారు. ‘నేనే ముందుంటా. నాయకత్వం వహిస్తా. నేను చేసినట్లుగా ఏ నాయకుడూ చేయలేడు. రిస్క్‌ ఉందని నాకు తెలుసు. అయినా సరే. ఇప్పుడు మరింత మెరుగ్గా ఉన్నా. నాకు నిరోధకత ఉండి ఉండొచ్చు’అని పేర్కొన్నారు. అంతకుముందు, వాల్టర్‌ రీడ్‌ నేషనల్‌ మిలిటరీ సెంటర్‌ నుంచి డిశ్చార్జి అయిన ట్రంప్‌ మాస్కు ధరించి ఒంటరిగా బయటకు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news