ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యే..ఏలూరులో ఆసక్తిరేపుతున్న పంచాయతీ ఫైట్

-

పంచాయతీ ఎన్నికల పోరు వైసీపీ,టీడీపీ మధ్య ఆసక్తిరేపుతుంటే ఏలూరులో మాత్రం అధికార పార్టీలోని రెండు వర్గాల మధ్యే ఆసక్తికర సమరం నడుస్తుందట. ఇద్దరూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులే. ఒకరు ఎంపీ.. ఇంకొకరు ఎమ్మెల్యే ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా ఆదిపత్యపోరు నడుస్తుండగా పంచాయతీ ఎన్నికల్లోనూ ఆ నేతల తీరు మారలేదు. దీంతో ఒకే పార్టీ నుంచి రెండువర్గాల వారు పోటిపడటంతో ఇద్దరు నేతల ఆధిపత్యపోరు ఆసక్తికరంగా మారింది.

కోటగిరి శ్రీధర్‌. ఏలూరు వైసీపీ ఎంపీ. ఎలీజా చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే. ఏలూరు లోక్‌సభ పరిధిలోనే చింతలపూడి ఉంటుంది. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కావడంతో అంతా బావున్నట్లే పైకి కనిపిస్తుంది. కానీ ఎంపీ శ్రీధర్‌, ఎలీజాలకు అస్సలు పడదు. ఒకరిపొడ మరొకరికి గిట్టదు. ఆధిపత్య పోరు ఓ రేంజ్‌లో సాగుతోంది. చింతలపూడిలో వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎవరి శిబిరం వారిదే. ఎవరి నినాదలు వారివే. ఎదురు పడితే మాత్రం ప్రత్యర్థులుగా మారిపోతారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఆ ఎఫెక్ట్‌ కనిపిస్తోంది.

ఎంపీ శ్రీధర్‌, ఎమ్మెల్యే ఎలీజాలు వైసీపీ విజయం కోసం కలిసి వ్యూహ రచన చేయడం లేదట. ఎవరి ఎత్తుగడలు వారివేనని సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉందట వీరి మధ్య యవ్వారం. చింతలపూడి మండలం ఉర్లగూడెం గ్రామంలో సర్పంచ్‌ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఎలీజా వర్గానికి చెందిన ఒకరు.. ఎంపీ శ్రీధర్‌ వర్గం నుంచి మరొకరు వైసీపీ మద్దతుదారులుగా బరిలో దిగారు. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. దీంతో పోరు రసవత్తరంగా మారింది. ఇదే మండలంలోని వెంకటాద్రిగూడెంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రెండువర్గాలకు చెందిన వారు ఒకే పార్టీ మద్దతుగా పోటీ చేస్తున్నారు.

పలు గ్రామాల్లో ఎంపీ శ్రీధర్‌ మద్దతుతో నామినేషన్‌ వేసిన అభ్యర్థులు తమ గ్రామాల పరిధిలో రెండుసార్లు ప్రచారం కూడా ముగించేశారట. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వర్గం దూకుడుగా వెళ్తోందట. పోటీ ప్రచారంతో గ్రామీణ ప్రాంతాల్లో పల్లె రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఈ విషయం పార్టీ పెద్దల దృష్టికి వెళ్లినా ఇద్దరు ప్రజాప్రతినిధులు వెనక్కి తగ్గడం లేదని సమాచారం. అక్కడి నుంచి గట్టి మొట్టికాయలు పడితేకానీ.. ఎవరో ఒకరు నామినేషన్‌ వెనక్కి తీసుకోరని పార్టీ వర్గాల్లో నడుస్తోన్న టాక్‌.

రెండువర్గాలకు చెందిన అభ్యర్థులు బరిలో ఉంటే మాత్రం.. క్షేత్రస్థాయిలో ఎంపీ, ఎమ్మెల్యేల అనుచరులు కుస్తీపట్లు పట్టడం ఖాయమని చెబుతున్నారు. అయితే ఈ కోల్డ్‌వార్‌ పతాకస్థాయికి చేరితే మాత్రం అది అల్టిమేట్‌గా పార్టీకి నష్టం చేకూర్చడం ఖాయమని కేడర్‌ ఆందోళన చెందుతోందట. ఎమ్మెల్యే, ఎంపీ శిబిరంలో చేరకుండా న్యూట్రల్‌గా ఉన్న వైసీపీ కేడర్‌కు ఎవరికి సపోర్ట్‌ చేయాలి.. ఎవరికి ఓటు వేయాలి అన్నది తేల్చుకోలేకపోతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news