డేరా బాబాకు పెరోల్​.. హరియాణా సీఎం మనోహర్​ క్లారిటీ

-

డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్‌ సింగ్‌కు 40 రోజుల పెరోల్‌ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిర్సాలోని తన ఆశ్రమంలో ఇద్దరు మహిళలను అత్యాచారం చేసినందుకు డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. డేరా ఆశ్రమ మేనేజర్‌ హత్య, జర్నలిస్ట్‌ హత్యకేసులోనూ ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. నవంబరు 3న అదమ్‌పూర్‌ ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయనకు పెరోల్ ఇవ్వడంపై దుమారం రేగుతోంది.

గత వారం డేరా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు 40 రోజుల పెరోల్‌ మంజూరైంది. ఇందులో తన పాత్రమీ లేదని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్‌ ఖట్టర్‌ తెలిపారు. జైళ్ల నియమనిబంధనల ప్రకారమే పెరోల్‌ వచ్చి ఉంటుందని స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బర్ణవ ఆశ్రమం నుంచి డేరాబాబా ఆన్‌లైన్‌ ఉపన్యాసాలు ఇస్తున్నాడు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఆయన అనుచరులతో పాటు హరియాణాకు చెందిన కొందరు బీజేపీ నేతలు హాజరయ్యారు.

ఈ విషయంపై స్పందించిన దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్.. రామ్ రహీమ్ సింగ్ పెరోల్​ను వెనక్కి తీసుకోవాలని హరియాణా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘రామ్ రహీమ్ ఓ రేపిస్ట్, హంతకుడు. హరియాణా ప్రభుత్వం ఎప్పుడంటే అప్పుడు ఆయనకు పెరోల్ ఇస్తోంది. రామ్ రహీమ్ బయటకు వచ్చి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వానికి చెందిన కొంతమంది నేతలు అందులో పాల్గొంటున్నారు’ అని స్వాతి మలివాల్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news