రూ.13 కోట్ల వ్యయంతో బ్రిడ్డి కడితే.. ప్రారంభించకముందే కుప్పకూలిందే..!! 

-

కాంట్రాక్టర్ల దనదాహానికి అమాయకపు ప్రజలు బలవుతున్నారు.. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాణాలు.. అయితే ప్రారంభోత్సవం రోజే కూలిపోతున్నాయి లేకుంటే ముందే నాశనం అవుతున్నాయి.. తాజాగా బిహార్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. గండక్‌ నదిపై రూ.13.43 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెన ఇంకా ప్రారంభించకుండానే కూలిపోయింది.
206 మీటర్ల పొడవైన ఈ వంతెన నిర్మాణ పనులు 2017లోనే పూర్తయినప్పటికీ అప్రోచ్‌ రోడ్డు లేకపోవడంతో ఇప్పటివరకు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఈ వంతెన కుప్పకూలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చీఫ్‌మినిస్టర్‌ నాబార్డ్‌(NABARD) పథకం కింద ఈ వంతెన నిర్మాణ పనులు 2016లో ప్రారంభించి ఏడాదిలోనే పూర్తి చేశారు. భారీ మొత్తంలో ఖర్చు చేసి వంతెన నిర్మాణం చేపట్టినా వినియోగంలో లేకపోవడంతో బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడ్డాయి. కొద్దిరోజుల క్రితమే 2, 3వ నంబర్ల స్తంభాల వద్ద పగుళ్లు ఉన్నట్టు గుర్తించిన అధికారులు దీనిపై ఉన్నతాధికారులకు లేఖలు రాసినట్టు సమాచారం. ఇంతలోనే ఈ వంతెన ముందు భాగం నదిలో కుప్పకూలిపోయింది.
సాహెబ్‌పూర్‌ కమల్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంతం పరిధిలోని ఆకృతి టోలచౌకి, బిషన్‌పూర్‌ నుంచి అహోక్‌ గండక్‌ ఘాట్‌ వైపు ఈ వంతెన నిర్మించారు. ఈ ఘటనపై లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌ పాసవాన్‌) నేత సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వంతెన నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. అనేకమంది అధికారులు కాంట్రాక్టర్‌ నుంచి డబ్బులు తీసుకొని నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడ్డారని ఆరోపించారు. సంబంధిత కాంట్రాక్టర్‌ను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏది ఏమైనా ఇలాంటి నిర్మాణాల వల్ల సామాన్య ప్రజలే నష్టపోతున్నారు. ఇది వాడుకలో లేదు కాబట్టి సరిపోయింది.. ఒకవేళ ప్రారంభోత్సవం జరిగి వాడుకలో ఉంటే ఎంత మంది బలయ్యవారో చెప్పగలమా..! ఎన్నో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో అవినితీ తిమింగళాలు చేరి ప్రజాధనాన్ని అంతా స్వాహా చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే మరొకరికి భయం కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news