జపాన్ లో భారీ భూకంపం.. 32వేల ఇళ్లకు కరెంట్ కట్

-

జపాన్‌ను మరోసారి భారీ భూకంపం వణికించింది. కొత్త ఏడాది తొలి రోజే ప్రకృతి విపత్తు అక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేసింది. సోమవారం మధ్యాహ్నం ఇషికావా రాష్ట్రంలోని నోటో ప్రాంతంలో వరుసగా భూప్రకంపనలు వచ్చాయి. 3.4 తీవ్రతతో మొదలైన ప్రకంపనలు ఒక దశలో తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.6గా నమోదయ్యాయి. ఐదు గంటల వ్యవధిలో మొత్తం 50 సార్లు భూప్రకంపనలు వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. తీర ప్రాంత రాష్ట్రాలైన ఇషికావా, నీగట, తొయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జపాన్ ప్రభుత్వం సూచించింది.

భూకంపం కారణంగా చాలా చోట్ల రహదారులు, భవనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ప్రజలు భయంతో రహదారులపైకి పరుగులు తీశారు. కొంతమంది శిథిలాల కింద చిక్కుకొన్నట్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. ఇప్పటి వరకు ఈ భూకంపం ధాటికి ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు భూ ప్రకంపనలతో రహదారులపై ఉన్న కార్లు ఊగిపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. 32 వేలకుపైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచింది. భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసిన అధికారులు ప్రజలంతా ఎత్తయిన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version