డోర్నకల్ : ప్రజలు గెలిచే ప్రజాస్వామ్యం రావాలి…కేసీఆర్

-

దశాబ్దాల నాటి పాత గుర్తులు పోవాలంటే ప్రజలు గెలిచే ప్రజాస్వామ్యం అధికారంలోకి రావాలని తెరాస అధినేత కేసీఆర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం డోర్నకల్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిస్తూ..దశాబ్దాల కాలంగా పాలించిన ప్రభుత్వాలు డోర్నకల్ ని నిర్లక్ష్యం చేశాయన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నాలుగేళ్లు గడవక ముందే అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తూ.. మరో సారి పరాయి పాలనను స్వాగతిస్తే తెచ్చుకున్న తెలంగాణకు అర్థం వుండదన్నారు. ‘పాలేరు నుంచి డోర్నకల్‌కు కూడా నీళ్లు కావాలని రెడ్యానాయక్ నాతో కొట్లాడిండు. తన ప్రజలు బాగుండాలని రెడ్యానాయక్ తపన. డోర్నకల్‌కు ఎస్సారెస్పీ కాలువ వస్తోందని తెలిపారు. అన్ని అనుకున్నట్లు జరిగితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నెల రోజుల్లోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

58 ఏళ్లు పాలించిన టీడీపీ, కాంగ్రెస్ కూటమి ఒక వైపు.. నాలుగున్నరేళ్లు పాలించిన టీఆర్ఎస్ ఒక వైపు ఉన్నాయని.. ఏ పార్టీకి ఓటేస్తే న్యాయం జరుగుతుందో ప్రజలే ఆలోచించుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో గిరిజనులు అధికంగా ఉన్న నియోజకవర్గం డోర్నకల్ అని కేసీఆర్ వివరించారు. ఇచ్చిన మాట ప్రకారమే నియోజకవర్గంలో 84 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని. త్వరలో డోర్నకల్‌లో 84 మంది గిరిజనులు సర్పంచ్ కాబోతున్నారని తెలిపారు. దశాబ్దాలుగా వాళ్లు చేయలేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తెరాస ప్రభుత్వం చేసిందన్నారు. ఓటేసే ముందు ఎవరికి వేస్తే అభివృద్ధి జరుగుతుందో అని ఒక్క సారి ఆలోచించుకోవాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version