హాట్‌ సమ్మర్‌లో కూల్‌ న్యూస్‌.. ఈనెల 27న నైరుతి రుతుపవనాల రాక

-

ఈసారి నైరుతి రుతుపవనాలు దేశాన్ని సాధారణం కంటే ముందుగానే తాకనున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా ఇచ్చిన ప్రకటన ప్రకారం, మే 27న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశం ఉంది. ఇది సాధారణ తేదీ అయిన జూన్ 1కు ఐదు రోజుల ముందుగా ఉండడం విశేషం. ఐఎండీ ప్రకారం, ఈ అంచనాలో నాలుగు రోజుల ముందు లేదా తరువాత మారవచ్చని కూడా పేర్కొంది. రుతుపవనాల ముందస్తు ఆగమనంతో రైతులు ఖరీఫ్ పంటల సాగు పనులను త్వరగా ప్రారంభించగలుగుతారు. వర్షాకాలంలోకి ప్రవేశించే తొలి సూచికగా కేరళను భావించడం వల్ల, ఇది వ్యవసాయ రంగానికి కీలక ఘట్టంగా మారుతుంది. నైరుతి రుతుపవనాలే దేశంలోని ఎక్కువ వర్షపాతం అందించేవిగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే.

 

ఈ ప్రవేశ తేదీ అంచనాకు ఐఎండీ ఆరు రకాల వాతావరణ సూచికలను ఆధారంగా తీసుకుంటుంది. వీటిలో వాయువ్య భారతదేశ ఉష్ణోగ్రతలు, దక్షిణ ద్వీపకల్పంలో ముందస్తు వర్షాలు, సముద్ర మట్ట పీడనం, లాంగ్‌వేవ్ రేడియేషన్, ట్రోపోస్ఫిరిక్ గాలుల గమనాలు వంటివి ఉన్నాయి. 2005 నుండి రుతుపవనాల ప్రవేశ తేదీపై అధికారిక అంచనాలు విడుదల చేస్తోన్న ఐఎండీ, అత్యాధునిక గణాంక నమూనా ఆధారంగా ఈ నిర్ణయాలు తీసుకుంటోంది. గత 20 ఏళ్లలో 2015ను మినహాయిస్తే, ఐఎండీ అంచనాలు పెద్దగా దాటిపోయిన సందర్భాలు లేవు.

ఇక గత నెలలో ఐఎండీ ప్రకటించిన మరో ముఖ్యమైన అంశం ప్రకారం, ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావొచ్చని అంచనా. ఇది రైతులకు మరింత సహాయపడే విషయంగా మారింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news