కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పౌరసత్వంపై అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు వారాల్లో పౌరసత్వం అంశం తేల్చాలని కేంద్రానికి గడువు నిర్దేశించింది. అయితే కేంద్ర సర్కార్ 8 వారాల గడువు కోరగా.. నాలుగు వారాల గడువు ఇస్తూ.. తదుపరి విచారణను లక్నో బెంచ్ ఏప్రిల్ 21వ తేదీకి వాయిదా వేసింది. ఆలోగా స్టేటస్ రిపోర్ట్ను కేంద్రం కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.
రాహుల్ గాంధీ పౌరసత్వంపై కొన్నేళ్లుగా వివాదం నలుగుతూనే ఉంది. ఆయన బ్రిటన్ పౌరుడని, భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యర్త విఘ్నేశ్ శిశిర్ వేసిన పిటిషన్లపై తాజాగా అలహాబాద్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఓ బ్రిటన్ కంపెనీకి రాహుల్ గాంధీ డైరెక్టర్, సెక్రటరీగా ఉన్నారని ఆ కంపెనీ వార్షిక నివేదికలో తనను తాను బ్రిటిష్ పౌరుడిగా గాంధీ పేర్కొన్నట్లు స్వామి తెలిపారు. ఈ క్రమంలో వేరే దేశంలో పౌరుడిగా ఉన్న వ్యక్తి ఆ దేశ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.