ఫింగర్ ప్రింట్స్ లేకున్నా ఐరిస్‌తో ఆధార్‌

-

కేంద్ర ప్రభుత్వం ఆధార్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వేళ్లు లేని వారు.. వేలి ముద్రలు సరిగా పడనివారు.. ఐరిస్‌ ద్వారా ఆధార్‌ పొందవచ్చని తాజాగా కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. వేళ్లు లేవని, ముద్రలు సరిగా పడటం లేదన్న పేరుతో ఆధార్‌ను తిరస్కరించలేరని ఆయన వెల్లడించారు.

కేరళలోని కొట్టాయం జిల్లా కుమరకోం పట్టణంలో వేళ్లు లేని జోసిమోల్‌ పి.జోస్‌ అనే మహిళ ఇంటికెళ్లి సిబ్బంది ఆధార్‌ నమోదు చేసిన విషయాన్ని శనివారం రాజీవ్‌ చంద్రశేఖర్‌ గుర్తు చేశారు. ఈ సందర్భంగానే.. వేలి ముద్రలు ఇవ్వలేని వాళ్లు ఐరిస్‌ స్కాన్‌ ద్వారా, ఐరిస్‌ సరిగా రానివాళ్లు వేలిముద్రల ద్వారా ఆధార్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎవరికైనా వేలి ముద్రలు, ఐరిస్‌ రెండూ లేకపోతే అవి లేకుండానే ఆధార్‌ కోసం పేర్లు నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

అలాంటివారు బయోమెట్రిక్‌ ఎక్సెప్షన్‌ ఎన్‌రోల్‌మెంట్‌ గైడ్‌లైన్స్‌ కింద పేరు, లింగం, చిరునామా, పుట్టిన తేదీ వివరాలను సమర్పించి, అందుబాటులో ఉన్న బయోమెట్రిక్స్‌ ఇస్తే సరిపోతుందని వివరించారు. వాళ్ల దగ్గర ఏయే అంశాలు లేవో ఆ వివరాలను ఎన్‌రోల్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయడంతోపాటు,  మార్గదర్శకాలకు అనుగుణంగా ఫొటోగ్రాఫ్‌ తీసుకోవాలని చెప్పారు. ఈ నిబంధనలను పాటించిన అనంతరం ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సెంటర్‌ సూపర్‌వైజర్‌ ధ్రువీకరిస్తే సరిపోతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news