చంద్రుడి ఆర్బిట్​లో మరింత దిగువకు చంద్రయాన్‌-3

-

చంద్రయాన్-3 ప్రయోగంలో రోజుకో కీలక మలుపు చోటుచేసుకుంటోంది. చంద్రుడి ఆర్బిట్​లో పరిభ్రమిస్తున్న చంద్రయాన్‌-3 తాజాగా మరో విన్యాసాన్ని పూర్తి చేసుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు ఆదివారం రాత్రి చంద్రయాన్​-3లోని ఇంజిన్‌ను మండించారు. దీని ద్వారా ఈ వ్యోమనౌక కక్ష్యను మరింత తగ్గించారు. ఫలితంగా అది జాబిల్లి ఉపరితలానికి మరింత చేరువైంది.

తదుపరి ఇలాంటి విన్యాసాన్ని ఈ నెల 9న మధ్యాహ్నం 1.00 నుంచి 2.00 గంటల మధ్య నిర్వహించనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ తర్వాత మరో రెండుసార్లు వీటిని చేపడతామని చెప్పారు. ఇలా దశలవారీగా వ్యోమనౌక ఎత్తును తగ్గించి.. అంతిమంగా దాన్ని చంద్రుడి చుట్టూ ఉన్న 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతామని వెల్లడించారు. ఈ నెల 23న చంద్రయాన్-3ని చంద్రుడిపైన దించుతామని తెలిపారు. గత నెల 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి నింగిలోకి పయనమైన చంద్రయాన్‌-3.. వివిధ దశలు ముగించుకొని శనివారం రాత్రి చందమామ కక్ష్యలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news