మూన్‌లైటింగ్ ఉద్యోగులకు ఐటీ శాఖ నోటీసులు..!

-

కరోనా సమయంలో బాగా ప్రాచుర్యం చెందిన మూన్ లైటింగ్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మూన్‌లైటింగ్‌ ద్వారా ఆదాయం పొంది.. ఆ ఆదాయాన్ని ఐటీ రిటర్నుల్లో చూపించని ఉద్యోగులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతానికి 2019-2020, 2020-2021 ఆర్థిక సంవత్సరాల ఆదాయాలకు సంబంధించి ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసినట్లు ఆంగ్ల పత్రిక ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ పేర్కొంది.

కరోనా సమయంలో ముఖ్యంగా ఐటీ రంగంలో .. ఒక కంపెనీలో పూర్తి స్థాయిలో ఉద్యోగిగా పనిచేస్తూనే అదనపు ఆదాయం కోసం మరో సంస్థలో పనిచేసి కొందరు జీతం తీసుకున్నారు. మరి కొందరు నెలవారీ, ఇంకొందరు మూడు నెలలకోసారి చొప్పున ఆదాయం పొందారు. ఈమూన్‌లైటింగ్‌కు పాల్పడిన వారిని కొన్ని సంస్థలు ఉద్యోగం నుంచి తొలగించాయి.

ఈ నేపథ్యంలో కొందరు ఉద్యోగులు కేవలం ప్రధాన కంపెనీ ఆదాయాన్ని మాత్రమే రిటర్నుల్లో చూపించినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఆయా ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. తొలుత రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు వార్షికాదాయాన్ని రిటర్నుల్లో చూపించని వారికి ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య దాదాపు వెయ్యికిపైనే ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news