పరీక్షకు ముందురోజు రాత్రే నీట్ పేపర్‌ అందింది.. అంగీకరించిన విద్యార్థులు

-

‘నీట్‌- యూజీ ప్రవేశపరీక్ష 2024’లో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. బిహార్‌లో ఈ పరీక్ష క్వశ్చన్ పేపర్ లీకైనట్లు వార్తలు రాగా కేంద్ర ప్రభుత్వం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ వార్తలను ఖండించింది. అయితే, పేపర్‌ లీక్‌ నిజమేనని తాజాగా బయటికొచ్చింది. పరీక్ష ముందు రోజు రాత్రే నీట్‌ క్వశ్చన్ పేపర్ తమకు అందిందని బిహార్‌లో అరెస్టయిన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీకరించడం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బిహార్‌ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో బిహార్‌ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్‌ ఇంజినీర్‌తో పాటు ముగ్గురు నీట్‌ అభ్యర్థులు కూడా ఉన్నారు.

వీరిలో ఓ అభ్యర్థి జూనియర్‌ ఇంజినీర్‌కు స్వయానా మేనల్లుడు కావడం గమనార్హం. రాజస్థాన్‌లోని కోటాలో నీట్‌కు ప్రిపేర్‌ అవుతున్న తనకు తన మామయ్య ఫోన్‌ చేసి పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశానని, ఇంటికి రమ్మని పిలిచారని సదరు అభ్యర్థి పోలీసులకు తెలిపారు. నీట్‌ పరీక్ష (మే 5) తేదీకి ఒక రోజు ముందు అంటే మే 4వ తేదీ రాత్రి తన స్నేహితులను తీసుకుని మామయ్య వద్దకు వెళ్లానని.. అక్కడ తనకు నీట్‌ ప్రశ్నపత్రం, ఆన్సర్‌ షీట్‌ ఇచ్చారని రాత్రంతా వాటిని తాము బట్టీపట్టి మరుసటి రోజు పరీక్షా కేంద్రానికి వెళ్లిన తర్వాత ప్రశ్నపత్రాన్ని చూస్తే.. ముందు రోజు మామయ్య ఇచ్చిన పేపర్‌తో పూర్తిగా మ్యాచ్‌ అయ్యిందని ఆ నీట్‌ అభ్యర్థి పోలీసులకు వెల్లడించాడు.

Read more RELATED
Recommended to you

Latest news