మద్యం అమ్మకాల్ని బంద్ చేసి డోర్ డెలివరీ చేస్తారట

-

కరోనాకు చెక్ పెట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత అనుకున్న ఇరవై ఒక్కరోజులతో కరోనాను కంట్రోల్ చేయటం సాధ్యం కాదని తేలటమేకాదు.. అంతకంతకూ పొడిగిస్తున్నారు. దీంతో.. ఆయా రాష్ట్రాలకు ఆదాయం భారీగా పడిపోయింది. ఇలాంటివేళ.. మద్యం అమ్మకాలతో ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల్ని మొదలు పెట్టేశాయి పలు రాష్ట్రాలు.

ప్రస్తుతం లాక్ డౌన్ 3.0 షురూ అవుతున్న వేళ.. కొన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలకు ఓకే చెప్పటం.. మందుబాబు రోడ్ల మీదకు భారీగా వచ్చేస్తున్నారు. ఇప్పటివరకూ కొనసాగిన భౌతికదూరాన్ని వదిలేసి.. మద్యం కోసం పడుతున్న ఆరాటం చూసినోళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. కరోనా కాటుకు భయపడేది లేదంటూ బరి తెగించినట్లుగా వ్యవహరిస్తున్న మందుబాబులతో కరోనా ముప్పు మరింత పెరుగుతుందన్న ఆందోళనలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాల్ని బంద్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని మద్యం షాపుల్ని బంద్ చేయాలని… ఆన్ లైన్ లో మాత్రమే మద్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించారు. మద్యం తాగాలనుకున్న వారు ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండేందుకు చేసిన కట్టడి కరోనా పాజిటివ్ కేసుల్ని కంట్రోల్ చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంతకీ ఈ ఆన్ లైన్ విధానం ఎలా ఉందన్నది చూస్తే.. ఆన్ లైన్ లో ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. అలా ఆర్డర్ చేసుకున్న వారికి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు ఇంటికే మద్యాన్ని సరఫరా చేస్తారు. మరీ.. విధానాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే సరి. ఆదాయంతో పాటు.. లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేసినట్లు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news