బిల్లుల ఆమోదంలో జాప్యంపై సుప్రీం సీరియస్.. ఏం చేస్తున్నారంటూ గవర్నర్లకు ప్రశ్న

-

బిల్లుల జాప్యంలో గవర్నర్లపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. అసెంబ్లీలు తీర్మానించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను ఉద్దేశపూర్వకంగానే ఆమోదించకుండా గవర్నర్‌లు జాప్యం చేస్తున్నారని తమిళనాడు, కేరళ, పంజాబ్‌ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా.. బిల్లులు ఆమోదించకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారని.. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని ధర్మాసనం ప్రశ్నించింది. మరోవైపు కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, ఆయన కార్యాలయంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. బిల్లుల ఆమోదానికి జరుగుతున్న జాప్యానికి కారణాలు వివరించాలని ఆదేశించింది.

కేరళ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 168 ప్రకారం గవర్నర్‌లు శాసనసభలో భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని విన్నవించారు. అందుకు సంబంధించిన వివరాలను ధర్మాసనానికి సమర్పించారు. గత 21 నెలలుగా ఎనిమిది బిల్లులను గవర్నర్‌ ఆమోదించలేదని కోర్టుకు విన్నవించారు. ఆయన వాదనలు విన్న సుప్రీం కోర్టు.. బిల్లుల ఆమోదంలో జాప్యానికి గల కారణాలు వివరించాలని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, ఆయన కార్యాలయంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news