భారత్ నుంచి ఒత్తిడి.. ట్విటర్ మాజీ సీఈవో ఆరోపణలను ఖండించిన కేంద్రం

-

ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సే భారత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సాగు చట్టాలపై ఆందోళనల జరిగిన సమయంలో భారత ప్రభుత్వం నుంచి తమకు ఒత్తిడి ఎదురైందంటూ ఆరోపించారు. ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. డోర్సే చెబుతున్న విషయాలు పచ్చి అబద్ధాలని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ కొట్టి పారేశారు. ట్విటర్ చరిత్ర నుంచి చాలా సందేహాస్పద కాలాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజీవ్‌ ట్వీట్ చేశారు. భారత సార్వభౌమాధికారాన్ని అంగీకరించలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డోర్సే.. ఏ ప్రభుత్వం నుంచైనా మీకు ఒత్తిడి ఎదురైందా అని యాంకర్ ప్రశ్నించగా.. భారత్ గురించి ఆయన ఉదాహరణగా చెప్పారు. భారత్​లో సాగు చట్టాలపై రైతు ఆందోళనలు జరుగుతున్న క్రమంలో మోదీ సర్కారు నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నామని వెల్లడించారు. రైతులు, జర్నలిస్టుల అకౌంట్ల కంటెంట్​ను తొలగించాలంటూ అనేక అభ్యంతరాలు పెట్టారని వివరించారు. ఒక దశలో ట్విట్టర్‌ను భారత్‌లో మూసేస్తామని కూడా బెదిరించినట్లు ఆయన ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news