గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి సంబంధించి కొత్త ప్రతిపాదనపై భాగస్వామ్య రాష్ట్రాలతో జాతీయ జల అభివృద్ధి సంస్థ ఇవాళ చర్చించనుంది. సమ్మక్క ఆనకట్ట నుంచి తొలిదశలో 141 టీఎంసీలు తరలించే అంశాన్ని తాజాగా తెరపైకి తెచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు సాగునీరుతో పాటు కర్ణాటక, పుదుచ్చేరికి తాగునీరు ఇవ్వాలని ప్రతిపాదించింది. బెంగళూరు వేదికగా జరగనున్న నేటి సమావేశంలో రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకొని తదుపరి కార్యాచరణ చేపట్టనున్నారు.
సమ్మక్క ఆనకట్ట నుంచి 141 టీఎంసీలు తరలించాలన్న ప్రతిపాదనపై జాతీయ జల అభివృద్ధి సంస్థ భాగస్వామ్య రాష్ట్రాలతో బెంగళూరులో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, తదితర రాష్ట్రాల అధికారులను ఆహ్వానించారు. తెలంగాణ నుంచి ఈఎన్సీ మురళీధర్, ఇతర ఇంజనీర్లు సమావేశానికి హాజరుకానున్నారు.
కొత్త ప్రతిపాదనను ఎన్డబ్ల్యూడీఏ ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు పంపింది. ఆ ప్రతిపాదనపై రెండు తెలుగు రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయన్నది కీలకంగా మారింది. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకొని తదుపరి కార్యాచరణను జాతీయ జల అభివృద్ధి సంస్థ చేపట్టనుంది.