కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి గోల్నాక చర్చ్ నుంచి అంబర్ పేట్ వాణి ఫోటో స్టూడియో వరకు ఫ్లైఓవర్ పై నడుస్తూ అధికారులతో వివరాలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఆయనతోపాటు R& B, నేషనల్ హైవే అధికారులు (RO) GHMC అన్ని విభాగాల అధికారులు, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, రెవిన్యూ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు.‘‘చాదర్ ఘట్ నుంచి వరంగల్ కు వెళ్లే జాతీయ రహదారికి గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రోడ్డు వైండింగ్ చేయడం జరిగింది. అంబర్ పేట చే నెంబర్ వద్ద రెండు వైపులా శ్మశాన వాటిక ఉండటంతో రోడ్డు వైండింగ్ కుదరలేదు.
నేను అంబర్ పేట శాసనసభ్యుడిగా, ఎంపీగా చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి.. శ్మశాన వాటిక ఉన్నందున ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని కోరాను. ఈ మార్గంలో విపరీతమైన రద్దీ ఉంటుంది. స్థానిక ప్రజలు కూడా నిత్యం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఈ జాతీయ రహదారి గుండా వెళ్లే వరంగల్, ఖమ్మం ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ మంజూరు చేయాలని ప్రధాని మంత్రిని అడిగినప్పుడు ఆయన వెంటనే ఒప్పుకొని మంజూరు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి పూర్తిగా సహకరించి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి.. మిగతా ఐదు చోట్ల భూసేకరణ చేసి సహకరించాల్సిన అవసరం ఉంది. ఒకచోట భూసేకరణకు సంబంధించి రూ.2 కోట్ల 51 లక్షలు చెక్కు తీసుకున్న తర్వాత కూడా భూసేకరణకు స్థలం నేషనల్ హైవే అథారిటికి అప్పగించలేదు. దాన్ని త్వరగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలన్నారు.