ఆంధ్రజ్యోతిపై వైసీపీ మినిస్టర్ డైరెక్ట్ అటాక్..?

-

ఆంధ్రజ్యోతి పత్రికపై వైసీపీ మంత్రి పేర్ని నాని డైరెక్ట్ ఎటాక్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా రంజకంగా పాలన చేస్తుంటే చూడలేక కొందరు ఈర్ష్య తో వార్తలు రాస్తున్నారని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వానికి బాకా కొట్టిన వారికి తమ ప్రభుత్వ పాలన రుచించటం లేదని నేరుగానే ఆ పత్రికను ఉద్దేశించి కామెంట్లు చేశారు.

సచివాలయ ఉద్యోగాల్లో ఒకరికో ఇద్దరికో మంచి మార్కులు వస్తే పేపర్ లీక్ అని ఆంధ్రజ్యోతి నిరాధార వార్తలు రాసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదన్న పేర్ని నాని… తమ ప్రభుత్వం లక్షల మందికి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చినా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

ఆర్టీసీలో బస్సుల కొనుగోలుకు ఇంకా ప్రభుత్వం విధివిధానాలే రూపొందించలేదని… కానీ ఆంధ్రజ్యోతి అప్పుడే వ్యతిరేక వార్తలు రాస్తోందని మండిపడ్డారు. శ్రీలంకలో ఎల్టీటీఈ కోసం ఆత్మాహుతి చేసుకునే తరహాలోనే చంద్రబాబు కోసం కూడా సదరు మీడియా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

పత్రికలది మంచి జర్నలిజమే అయితే ఆర్టీసి ఎండీ ఇచ్చిన వివరణను ఆంధ్రజ్యోతి ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన రిజాయండర్ ప్రచురించకుండా ఏ జర్నలిజం విలువలు పాటిస్తున్నారని మంత్రి పేర్ని నాని నిలదీశారు. ఉద్దేశ్యపూర్వకంగా ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న వారిపై ప్రతిచర్య ఉంటుందన్నారు.

గతంలో నేరుగా సాక్షి విలేఖరుల పేర్ల పైనే జీవో ఇచ్చేసి విలేకరుల ను, మీడియా వారిని అరెస్టులు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని నాని గుర్తు చేశారు. కానీ అప్పుడు ఎవరికి మీడియా స్వేచ్ఛ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news