రిషి సునాక్‌ సంచలన నిర్ణయం.. విదేశీ సాయం మరో రెండేళ్లు లేనట్టే

-

బ్రిటన్ ప్రధానిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్…దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తాజాగా రిషి సునాక్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్‌ను అందులోంచి గట్టెక్కించేందుకు నడుంబిగించిన సునాక్.. విదేశీ సాయాన్ని మరో రెండేళ్లపాటు నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. తన మొత్తం జాతీయ ఆదాయంలో 0.5 శాతాన్ని విదేశీ సాయం కోసం వినియోగిస్తోంది బ్రిటన్. కరోనా నేపథ్యంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రెండేళ్ల క్రితం విదేశీ సాయాన్ని బ్రిటన్ నిలిపివేసింది. సంక్షోభం నుంచి ఇంకా బయటపడకపోవడంతో ఆ సాయాన్ని మరో రెండేళ్లపాటు నిలిపివేయాలని నూతన ప్రధాని నిర్ణయించినట్టు ‘టెలిగ్రాఫ్’ పత్రిక ఓ కథనంలో పేర్కొంది.

బోరిస్ జాన్సన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న రిషి సునాక్ అప్పట్లో మాట్లాడుతూ.. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే 2024-25 నాటికి విదేశీ ఆర్థిక సాయాన్ని 0.5 శాతం నుంచి 0.7 శాతానికి పెంచుతామన్నారు. అయితే, పరిస్థితులు మెరుగుపడకపోవడంతో ఈ సాయాన్ని మరో రెండేళ్లు అంటే 2026-27 వరకు నిలిపివేయాలని నిర్ణయించినట్టు రిషి సర్కార్‌ తెలిసింది. అయితే, ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు విదేశీ సాయాన్ని నిలిపివేయడం ఒక్కటే సరిపోదని, మరికొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని టెలిగ్రాఫ్ పేర్కొంది. అందులో భాగంగా మరికొన్ని అంశాల్లోనూ కోతలు పడే అవకాశం ఉందని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version