నేడే తెలంగాణ కేబినెట్ సమావేశం

-

ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు ప్రగతిభవన్‌లో మంత్రి వర్గం సమావేశం కానుంది. శాసనసభ సమావేశాలపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల ఆరో తేదీ నుంచి ఉభయ సభలు సమావేశం కానున్నాయి. సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం, సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. విపక్షాలను దీటుగా ఎదుర్కొనే విషయమై మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కూడా చర్చించే అవకాశం ఉంది.

రాష్ట్రానికి నిధులు, విద్యుత్ బకాయిల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో కేబినెట్‌లో ఈ విషయంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. జాతీయ రైతు సంఘాల సమావేశ నిర్ణయాలు, తీర్మానాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వివిధ జిల్లాల్లో ఉన్న పోడు భూముల సమస్య పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాల్సి ఉన్న తరుణంలో అందుకు సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి గతంలో చేసిన భూ కేటాయింపులకు ఆమోదంతో పాటు మలక్‌పేటలో సచివాలయ ఉద్యోగుల క్వార్టర్స్ స్థలాన్ని ఐటీ హబ్‌కు కేటాయించే అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, రాజకీయ పరిస్థితులతో పాటు మునుగోడు ఉపఎన్నిక కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version