తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నదని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవాదుల ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తిచేసే లక్ష్యంతో స్పష్టమైన ప్రణాళికను రూపొందించామని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి శనివారం ఆయన దేవన్నపేట వద్ద ఉన్న దేవాదుల పంపుహౌస్ను పరిశీలించారు. అనంతరం ధర్మసాగర్ వద్ద పైప్లైన్ల పనులను, భద్రకాళి చెరువులో పూడికతీత పనులను సమీక్షించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 84 శాతం ప్రజలకు రేషన్ ద్వారా సన్నబియ్యంతో భోజనం అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే ప్రస్తుతం రెండు సీజన్లలో తెలంగాణలోనే అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని పేర్కొన్నారు. రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, త్వరలో మరో మూడు లక్షల మందికి కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు.
ఇక సమ్మక్క సారక్క బరాజ్కు గోదావరి జలాలను కేటాయించేందుకు కేంద్రం తో పాటు ఛత్తీస్గఢ్ సీఎంతోనూ చర్చలు జరిగాయని పేర్కొన్నారు. సాగునీటి అవసరాల కోసం రాష్ట్రం ప్రతి సంవత్సరం రూ.23 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తుందని వెల్లడించారు. ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యేలు, అధికారులు మరింత సమగ్ర దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ, అసంపూర్ణంగా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితంగా పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, కేఆర్. నాగరాజు, సత్యనారాయణరావు, మురళీనాయక్, నాయిని రాజేందర్రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.