తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ ప్రారంభమవుతుంది. ఈనెల 26వ తేదీ నుంచి హైదరాబాద్ గోల్కొండ బోనాలు ప్రారంభమవుతున్నాయి. కాగా ఈ సంవత్సరం హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వెల్లడించారు. ఈరోజు ఆషాడ బోనాల రివ్యూ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కొండా సురేఖ మాట్లాడారు. బోనాల పండుగ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు సురేఖ సూచించారు. ఇప్పటికే రూ. 20 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని సురేఖ వెల్లడించారు. అవసరమైతే సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి మరిన్ని నిధులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సురేఖ అన్నారు. ఈ కార్యక్రమంలో సురేఖతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ తో సహా మరి కొంత మంది మంత్రులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ బోనాల పండుగ జరుపుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి సురేఖ అన్నారు.