అసెంబ్లీ సమావేశాలకు ఆటోల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

-

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈరోజు సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో బయల్దేరారు. ఆటోడ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ఆటోల్లో చేరుకున్నారు. ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సుధీర్‌ రెడ్డి, వివేకానంద, మాధవరం కృష్ణారావు, పాడి కౌశిక్‌ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు హైదరాబాద్‌ హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డుపై పడ్డాయని ఈ సందర్భంగా హరీశ్‌ రావు అన్నారు. రెండు నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే ఆటో కార్మికులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని తెలిపారు. గిరాకీ లేక 6.5 లక్షల ఆటో కార్మికులు ఈఎంఐలు కట్టలేకపోతున్నారని, ఎంతోమంది ఉపవాసాలు ఉంటున్నారని వెల్లడించారు. చనిపోయిన డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ ఆటో కార్మికులకు నెలకు రూ.10 జీవన భృతి కల్పించే విధంగా పొందుపర్చాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news