కర్ఫ్యూ పెట్టినా.. కట్టడి చేసినా మేడిగడ్డకు వెళ్లి తీరతాం : కిషన్ రెడ్డి

-

వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని.. ప్రాజెక్టు భవిష్యత్తు అనుమానాస్పదంగా మారిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కుంచించుకు పోయిన ప్రాంతం పూర్తిగా తొలగించాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రజల పన్నులతో కట్టిన ప్రాజెక్టు కుంగిపోయిందని.. దాన్ని చూసేందుకే తాము వెళ్తున్నామని చెప్పారు.

ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. నిపుణులు చెప్పినా సీఎం కేసీఆర్ సూపర్ ఇంజినీర్​గా మారి కట్టిన ప్రాజెక్టు ఇప్పుడు గుదిబండగా మారే పరిస్థితి ఏర్పడిందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు ధర్నా చేయడానికి వెళ్లడం లేదని.. పరిస్థితి సమీక్ష చేసేందుకు వెళ్తున్నానని తెలిపారు. 144 సెక్షన్ పెట్టినా .. కర్ఫ్యూ పెట్టి కట్టడి చేసినా అక్కడికి వెళ్లి తీరతామని తేల్చి చెప్పారు. కర్ఫ్యూ పెట్టి కట్టడి చేయడానికి తాము అసాంఘీక శక్తులం కాదని.. బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధులమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news