‘రేపు విచారణకు హాజరు కాలేను’.. సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. రేపు విచారణకు హాజరుకాలేనని లేఖలో పేర్కొన్నారు. 41 ఏ నోటీసులు ఉపసంహరించుకోవాలని కోరారు. లేఖలో కీలక అంశాలను ప్రస్తావించిన ఎమ్మెల్సీ కవిత.. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోండని సీబీఐ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్యా ఈ నెల 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని వెల్లడించారు.

“సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదు. 2022 డిసెంబరులో అప్పటి ఐవో ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారు. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉంది. సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదు. నోటీసు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేస్తోంది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. నాకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున దిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుంది. ఇది నా ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుంది.” అని కవిత లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news